- డైలీ 4.50 లక్షల మంది ప్రయాణం
- కోచ్ల సంఖ్యను పెంచని అధికారులు
- ఎల్బీనగర్ – మియాపూర్ రూట్లో అధికంగా రద్దీ
హైదరాబాద్, వెలుగు : మెట్రోలో రోజురోజుకి రద్దీ పెరుగుతోంది.ఆఫీసులకు, ఇండ్లకు సమయానికి చేరుకోవాలనుకునే వారు మెట్రో ట్రైన్లలోనే వెళ్లేందుకే ఎక్కువగా ప్రయార్టీ ఇస్తున్నారు. అయితే.. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో కూర్చునేందుకు కూడా జాగా దొరకడం లేదు. నిల్చోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రోజు సుమారు 4.50 లక్షల మంది మెట్రోలో జర్నీ చేస్తున్నారు. ఈ మధ్య ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణించి రికార్డు బ్రేక్ చేశారు.
55 రైళ్లే తిరుగుతున్నయ్..
మూడు కారిడార్లలో 69 కి.మీల పరిధిలో మొత్తం 57 ట్రైన్స్కు 55 మాత్రమే తిరుగుతున్నాయి. ఒక్కో మెట్రో ట్రైన్కి 3 కోచ్లు ఉండగా.. మొత్తం రైళ్లకు కలిపి 165 కోచ్లతో ప్రయాణిస్తున్నాయి. మిగిలిన రెండు ట్రైన్స్ను ఏవైనా మొరాయించినపుడు, రైళ్లకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వినియోగిస్తుంటారు. ట్రైన్లకు ఇంకా కొన్ని కోచ్లను జత చేయొచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ట్రైన్స్ ను నడిపే టెక్నాలజీ సైతం హైదరాబాద్ మెట్రోకి ఉంది. ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదు.
రెడ్లైన్లో అధిక రష్
మూడు లైన్లలో ఎల్బీ నగర్ – మియాపూర్ (రెడ్ లైన్ ) రూట్లో 27 స్టేషన్లు ఉండగా అధిక రద్దీ ఉంటోంది. ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు, రద్దీ లేని లైన్లలో 6 నిమిషాలకు ఒక మెట్రో రైల్ నడిపిస్తామని చెప్పిన మెట్రో అధికారులు మరిచిపోయారు. రద్దీ లైన్లలోనే 7 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు ఒక ట్రైన్ నడుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు మెట్రోలో పుల్ రష్ ఉంటోంది. ఆయా సమయాల్లో ట్రైన్ స్టార్ట్ అయినా స్టేషన్లో కొందరికే సీట్లు దొరకుతున్నాయి. వేరే స్టేషన్ లో ఎక్కే ప్రయాణికులకు నిలబడటానికి కూడా జాగా దొరకడంలేదు. నాగోల్– రాయదుర్గం (బ్లూ లైన్ ) రూట్లో 23 స్టేషన్లు ఉండగా.. ఉదయం, సాయంత్రం ఫుల్ రష్గా ఉంటోంది. ఎంజీబీఎస్ – జేబీఎస్ (గ్రీన్ లైన్ ) రూట్లో ప్యాసింజర్లు తక్కువ ఉండటంతో రెవెన్యూ ఎక్కువ రావట్లేదు. దీంతో ఈ లైన్లో ఉన్న స్టేషన్లలో మెయింటెనెన్స్తగ్గించుకోవటం కోసం కేవలం వన్ సైడ్ మాత్రమే ఎస్కలేటర్, మెట్లను తెరిచారు. దీంతో కొందరు రోడ్డు దాటలేక మెట్రోను ఎక్కట్లేదు.
ఇప్పుడిప్పుడే ఆదాయం
లాస్లో ఉన్న మెట్రో ఇప్పుడిప్పుడే ప్రయాణికులు పెరగడంతో లాభాల బాట పడుతోంది. మెట్రో రైల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెట్రో స్మార్ట్ కార్డు, క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకొని ప్రయాణించే వారికి 10 శాతం రాయితీని గత మార్చి వరకు అన్ని సమయాల్లో చాన్స్ ఉండేది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి 12 వరకు రాయితీ ఇస్తున్నారు. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణం చేసే వారు రాయితీ కోల్పోతున్నారు. 1998 తర్వాత పుట్టిన స్టూడెంట్లకు 20 ట్రిప్ల డబ్బులు చెల్లించి 30 ట్రిప్లు ప్రయాణించొచ్చని మెట్రో ప్రకటించింది. పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. మెట్రో అధికారులు దృష్టి పెట్టడం లేదు.
రద్దీతో గాలి ఆడట్లేదు
మెట్రోలో లగేజీ, ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని వచ్చే వారే ఎక్కువ. వీరి కారణంగా నిలబడి ప్రయాణించే వారికి చాలా ఇబ్బంది అవుతోంది. ఏసీ చాలా తక్కువ వదులుతున్నారు. దీంతో గాలి ఆడట్లేదు. ఉన్న సీట్లను మహిళలకు వృద్ధులకు రిజర్వ్ చేశారు. ఒక్కో ట్రైన్కి రెండు కోచ్లను పెంచాలి.
– మనోజ్ బాబు, దిల్సుఖ్నగర్
కోచ్లు పెంచాలి
రోజూ అమీర్పేట నుంచి రాయదుర్గం వరకు జర్నీ చేస్తా. మెట్రోలో కూర్చోడానికి సీట్లు, నిలబడేందుకు జాగా కూడా ఉండట్లేదు. రద్దీ బాగా పెరగడంతో ఏసీ ఉన్నా ఉక్కపోత పోస్తోంది. రద్దీకనుగుణంగా కోచ్లను పెంచాలి.
– కిశోర్, సాప్ట్వేర్ ఎంప్లాయ్