
జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తుంది. హర్యానాలో కాంగ్రెస్ 47,బీజేపీ 15,ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి25 , బీజేపీ 15 , ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా రెండు రాష్ట్రాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. . హర్యానాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 464 మంది ఇండిపెండెంట్లు, 101 మహిళలు పోటీ చేస్తున్నారు. 67.90 శాతం ఓటింగ్ నమోదైంది.
ఇటీవల విడుదలైన ఎగ్జిట్పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. అటు బీజేపీ నేతలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. వరుసగా మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా, జమ్మూ కాశ్మీర్లోనూ ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్ని జిల్లాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది.