జనజాతర సభ సక్సెస్.. కాంగ్రెస్​ క్యాడర్​లో జోష్

జనజాతర సభ సక్సెస్.. కాంగ్రెస్​ క్యాడర్​లో జోష్

చేవెళ్ల, వెలుగు : జన జాతర  పేరుతో కాంగ్రెస్​పార్టీ మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్​అయింది. రేవంత్​రెడ్డి ముఖ్య​అతిథిగా పాల్గొని క్యాడర్​లో జోష్​నింపారు. రాష్ట్ర ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్​కు సిగ్గు రాలేదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టారు. వికారాబాద్​జడ్పీ చైర్​పర్సన్​పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, తమ వెంట నడిచిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారని వాపోయారు. 

భరించలేకనే పార్టీ మారామన్నారు. సీఎం రేవంత్​రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. చేవెళ్ల ఎంపీ సీటును గెలిచి రేవంత్​రెడ్డికి గిఫ్ట్​గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు మనోహర్​రెడ్డి, రాంమోహన్​రెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. హామీలు అమలు చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయన్నారు. చేవెళ్ల ఇన్​చార్జ్​పామేన భీంభరత్​మాట్లాడుతూ.. చేవెళ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని సీఎంని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్​ చైర్​ పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.