కాంగ్రెస్ పై ఆ పార్టీ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అంతం కాబోతుందని తెలిపారు. పార్టీని ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు వీడడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ పార్టీ నుంచి వైదొలగడం కాంగ్రెస్కు పెద్ద దెబ్బ అని చెప్పారు.
రాబోయే కాలంలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీని వీడతారని తనకు సమాచారం ఉందన్నారు ఆజాద్. ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించిన రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పారు ఆజాద్. ఈ సందర్భంగా మహారాష్ట నుంచే తన లెజిస్లేటివ్ కేరీర్ మొదలైందని గుర్తుచేసుకున్నారు.
మహారాష్ట నుంచే తాను లోక్ సభకు, రాజ్యసభకు ఎంపికైన విషయాన్ని చెప్పారు ఆజాద్. అయితే యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశాయంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. దేశం మానసిక స్థితిని గమనించిన తర్వాత తాను కాంగ్రెస్ను విడిచిపెట్టానని చవాన్ అన్నారు.