
- హాజరుకానున్న పీసీసీ చీఫ్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న కులగణనకు పార్టీ పరంగా ఎలాంటి సహకారం అందించాలన్న దానిపై పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, విప్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. కులగణనపై అన్ని జిల్లాల నేతల అభిప్రాయాలను తెలుసుకొని, ఎలా ముందుకు పోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నేడు మంత్రులతో ముఖాముఖి వాయిదా
గాంధీ భవన్లో బుధవారం జరగాల్సిన మంత్రులతో ముఖాముఖీ ప్రోగ్రాం వాయిదా పడింది. ఇవ్వాళ గాంధీ భవన్లో కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుండడం, దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరవుతున్నందున ముఖాముఖి ప్రోగ్రాంను వాయిదా వేసినట్టు పీసీసీ ప్రకటించింది.