![స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా](https://static.v6velugu.com/uploads/2024/05/3_GCzxkRWIXN.jpg)
- తీన్మార్ మల్లన్న తరఫున త్వరలో సీఎం ప్రచారం!
- ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్
- వచ్చేనెల 6న ముగియనున్న ఎంపీ ఎన్నికల కోడ్
- ఆ వెంటనే మూడు నెలల పాటు స్థానిక ఎన్నికల కోలాహలం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కాంగ్రెస్ దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియగానే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. వీటిలో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. అందుకు తగ్గట్టుగా పల్లెల్లో పార్టీ తరఫున ప్రోగ్రామ్స్ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నది. అయితే, ఈ లోకల్ బాడీ ఎన్నికలకు ముందు
నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పీసీసీ చీఫ్గా సీఎం రేవంత్రెడ్డిపై పడింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27 జరగనుంది. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది.
వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తవగానే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తయింది. మరో రెండు నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత మున్సిపల్ మేయర్, చైర్పర్సన్, కౌన్సిలర్, కార్పొరేటర్ల పదవీకాలం పూర్తికానుంది. రాబోయే మూడు నెలల్లోనే లోకల్ బాడీలకు వరుస ఎన్నికలు నిర్వహిస్తే మిగతా నాలుగున్నరేండ్లు పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టవచ్చని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.
ఎంపీ ఎన్నికల సందర్భంలో కూడా పార్టీ క్యాడర్కు దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడితే, అలాంటి వారికి ఆ వెంటనే జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ చెప్పారు. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియగానే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. సర్పంచ్ల ఎన్నిక పార్టీల గుర్తుపై జరగకపోయినా, పార్టీలో పనిచేస్తున్న చురుకైన కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరగనున్నందున కాంగ్రెస్లో చురుకైన గ్రామ
మండల స్థాయి నాయకులకు టికెట్లు ఇచ్చి మెజార్టీ మండల పరిషత్లను, అదే విధంగా మెజార్టీ జిల్లా పరిషత్లను ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలపై ఇప్పటి నుంచి పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. పల్లెల్లో పార్టీ పరమైన ప్రోగ్రామ్ లను స్పీడప్ చేయాలని పీసీసీ చూస్తున్నది.
మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ప్లాన్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర సర్కారు అనుకుంటున్నది. పట్టణాల అభివృద్ధిలో ఇవి కీలకమైనందున ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు రేవంత్కు ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే మెజార్టీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచి పట్టణ స్థాయిలో పార్టీ పరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు క్యాడర్ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చే నెల 6తో ముగియనుంది. ఆ తర్వాత మరో మూడు నెలల పాటు వరుసగా లోకల్ బాడీ ఎన్నికల వాతావరణం కనిపించనుంది.