- తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా
- దక్షిణాదిలో రాష్ట్రంపైనే రెండు జాతీయ పార్టీల భారీ అంచనాలు
- సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు
- ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: ఈ సారి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలువాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే తాము అధికారంలోకి వచ్చినందున తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పక్కాగా 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక.. దక్షిణాదిలో తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెలిచి, మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడింది. ఒకరొకరుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి వెళ్తున్నారు. కాగా.. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకత్వాలు ఎప్పటికప్పుడు తెలంగాణలోని లోక్సభ సీట్లపై సమాచారాన్ని తెప్పించుకొని అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి.
దూసుకుపోతున్న కాంగ్రెస్
తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి నమ్మకంతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా జనంలో మంచి ఆదరణ ఉందని, వందరోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారంటీలు ప్లస్ అవుతాయని భావిస్తున్నది. మూడు రోజుల కింద హైదరాబాద్ శివారు తుక్కుగూడ వేదికగా పార్టీ జాతీయ మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను రాహుల్గాంధీ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్లో ఇదే వేదికగా ఆరు గ్యారంటీలను సోనియాగాంధీ ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అదే సెంటిమెంట్తో ఇప్పుడు అక్కడే జాతీయ మేనిఫెస్టోను ప్రకటించడం కలిసి వస్తుందని, ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. జనజాతర సభ సక్సెస్ అయిందని, సభ వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోకు మంచి స్పందన వస్తున్నదని వాళ్లు చెప్తున్నారు. 14కు తగ్గకుండా రాష్ట్రం నుంచి ఎంపీలను అందిస్తామని తుక్కుగూడ సభా వేదికగా సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
కాగా, లోక్సభ సెగ్మెంట్లపై రేవంత్రెడ్డి రివ్యూలు చేస్తూ.. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ‘‘పక్కాగా మనం 14 సీట్లు గెలుస్తామని రిపోర్ట్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్నది. ఇంకింత కష్టపడితే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో స్వీప్ చేయొచ్చు. ఏ ఒక్క ఎంపీ సీటును కూడా ఆషామాషీగా తీసుకోవద్దు. జాతీయ మేనిఫెస్టోను ముఖ్యంగా మహిళలకు ప్రకటించిన రూ. లక్ష స్కీమ్ను జనంలోకి తీసుకెళ్లాలి. రాహుల్గాంధీని ప్రధానిగా చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు” అని సూచించారు.
గ్రౌండ్లో ప్రత్యేక టీమ్లు
వ్యూహకర్త సునీల్ కనుగోలుతోపాటు ఏఐసీసీ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్, రాహుల్ టీమ్ రాష్ట్రంలో పర్యటిస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేస్తున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 14 సీట్లను పక్కాగా గెలుస్తామన్న ధీమాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ వచ్చి ఆరు గ్యారంటీలు ప్రకటించడం, ప్రియాంక గాంధీ బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనడం, రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహించడం, మూడు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడే జరగడం, మూడురోజుల కింద జాతీయ మేనిఫెస్టోను కూడా ఇక్కడే విడుదల చేయడం వంటివన్నీ తెలంగాణకు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తున్న ప్రయారిటీకి నిదర్శనమని ఓ ముఖ్య నేత అన్నారు. హైకమాండ్ నమ్మకానికి తగ్గట్టుగా తాము వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని, వేవ్ను చూస్తూ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు.
ఉనికి చాటుకునే పనిలో బీఆర్ ఎస్
జాతీయ స్థాయి పార్టీగా ఎదగాలనుకున్న బీఆర్ఎస్ ఆశలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అడుగంటాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు. గత ఎంపీ ఎన్నికల్లో తొమ్మిది సీట్లను బీఆర్ఎస్ గెలువగా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో మిగిలిన సిట్టింగ్ ఎంపీలు కేవలం ఇద్దరే. తొమ్మిది మందిలో ఒకరు ఎమ్మెల్యేగా గెలువగా.. ఆరుగురు ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు.
గ్రామ స్థాయిలో సర్పంచులు, మున్సిపాలిటీల్లోని నేతలు కూడా చాలా మంది గులాబీ పార్టీని వదలారు. ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారు. పైగా.. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వెంటాడుతుండటం, పదేండ్ల కాలంలోని అక్రమాలు బయటకు వస్తుండటంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతున్నది.
హ్యాట్రిక్ నినాదంతో బీజేపీ
హ్యాట్రిక్ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తున్నది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి. దేశంలో పార్టీ 300 సీట్ల మార్క్ దాటడానికి తెలంగాణ సీట్లు కలిసి వచ్చాయని బీజేపీ నేతలు అంటుంటారు. ఇప్పుడు పది నుంచి 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ పేరుతో దేశమంతా బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నది. ఆ నినాదం సక్సెస్ కావాలంటే తెలంగాణలో పక్కాగా డబుల్ డిజిట్ సీట్లు గెలువాలని జాతీయ నాయకత్వం ఇక్కడి నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానం ఉంటుందని అంచనా వేశారు. దీన్ని బట్టి రాష్ట్రంలో తప్పకుండా తాము పదికిపైగా సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.
తుక్కుగూడ సభ సక్సెస్తో..
రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. 14 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరో మూడు సీట్లకు త్వరలో ప్రకటించనుంది. తుక్కుగూడ జన జాతర సభ ద్వారా ఆ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖం పూరించింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారి వెంట సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. త్వరలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, వీలైనన్ని ఎక్కువ సభలకు వారు వస్తారని రాష్ట్ర లీడర్లు చెప్తున్నారు. సోనియాగాంధీని కూడా ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు.
గ్రౌండ్లో నమో టీమ్
‘నమో’ టీమ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ చేస్తున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పెద్దలు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ రాష్ట్రానికి రెండుసార్లు వచ్చి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరుకానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు పార్టీ హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నదని, అందుకు తగ్గట్టుగా పదికిపైగా సీట్లు గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని బీజేపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.