
- గత ప్రభుత్వం పోలీసులను పెట్టి భూములు గుంజుకున్నది : కోదండ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కూడా పెట్టామని ఆయన గుర్తు చేశారు.
గురువారం ఆయన ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీ కోసం 2017లో కేంద్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి 19,330 ఎకరాలు కావాలని ప్రజాభిప్రాయం అడిగితే.. ప్రజలు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అయినా వేల మంది పోలీసులను పెట్టి భూములను గుంజుకున్నారని ఆరోపించారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ భూములనూ బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్నదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఆనాటి పాలక పక్షాలు పనిచేస్తే.. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు కృషి చేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అనంతరం బెల్లయ్య నాయక్మాట్లాడుతూ.. సీఎంగా రేవంత్ రెడ్డి బుల్లెట్ స్పీడ్తో పనిచేస్తున్నారని అన్నారు. ఆరేండ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటాలు నేడు ఫలించాయన్నారు. కాంగ్రెస్ చేస్తున్న పనులు, స్పీడును చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, గిరిజనుల పక్షాన ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణంగా అండగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉందని చెప్పేందుకు ఫార్మా సిటీ రద్దు నిర్ణయమే ఉదాహరణ అని చల్లా నర్సింహారెడ్డి అన్నారు. ఫార్మా సిటీ రద్దు నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.