కాంగ్రెస్​ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దుతో చేయడంతో ప్రజల్లో సంతోషం : కోదండ రెడ్డి​

కాంగ్రెస్​ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దుతో చేయడంతో ప్రజల్లో సంతోషం : కోదండ రెడ్డి​
  • గత ప్రభుత్వం పోలీసులను పెట్టి  భూములు గుంజుకున్నది : కోదండ రెడ్డి​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ కిసాన్​​ సెల్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్​ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కూడా పెట్టామని ఆయన గుర్తు చేశారు.

గురువారం ఆయన ఆదివాసీ కాంగ్రెస్​ చైర్మన్​ బెల్లయ్య నాయక్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీ కోసం 2017లో కేంద్ర ప్రభుత్వం, బీఆర్​ఎస్​ ప్రభుత్వం కలిసి 19,330 ఎకరాలు కావాలని ప్రజాభిప్రాయం అడిగితే.. ప్రజలు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అయినా వేల మంది పోలీసులను పెట్టి భూములను గుంజుకున్నారని ఆరోపించారు. పేదలకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ భూములనూ బీఆర్​ఎస్​ ప్రభుత్వం లాక్కున్నదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఆనాటి పాలక పక్షాలు పనిచేస్తే.. కాంగ్రెస్​ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు కృషి చేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్​ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అనంతరం బెల్లయ్య నాయక్​మాట్లాడుతూ.. సీఎంగా రేవంత్​ రెడ్డి బుల్లెట్​ స్పీడ్​తో పనిచేస్తున్నారని అన్నారు. ఆరేండ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటాలు నేడు ఫలించాయన్నారు. కాంగ్రెస్​ చేస్తున్న పనులు, స్పీడును చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులు, గిరిజనుల పక్షాన ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణంగా అండగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజల పక్షాన ఉందని చెప్పేందుకు ఫార్మా సిటీ రద్దు నిర్ణయమే ఉదాహరణ అని చల్లా నర్సింహారెడ్డి అన్నారు. ఫార్మా సిటీ రద్దు నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.