కర్ణాటక కేబినెట్‌ కీలక నిర్ణయం..‘మతమార్పిడి వ్యతిరేక చట్టం’ రద్దుకు ఒకే

కర్ణాటక కేబినెట్‌ కీలక నిర్ణయం..‘మతమార్పిడి వ్యతిరేక చట్టం’ రద్దుకు ఒకే

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని’ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్‌ గురువారం (జూన్ 15న) రద్దు ప్రతిపాదనను ఆమోదించింది. త్వరలో దీన్ని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేయనున్నారు.

చట్టం ఏం చెబుతోంది..? 

కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బలవంతంగా, ఒత్తిడి ద్వారా, తాయిలాలను ఆశచూపి, వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి పౌరులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, సహోద్యోగులు పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.

ఇందుకు సంబంధించిన బిల్లును గతేడాది అప్పటి ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టడంతో బిల్లు ఆమోదం పొందింది. అయితే.. శాసనమండలిలో బీజేపీకి సరిపడా మెజార్టీ లేకపోవడంతో బిల్లు ముందుకెళ్లలేదు. దీంతో గతేడాది మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదంతో చట్టాన్ని అమలు చేశారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కారు.. ఈ చట్టాన్ని రద్దు చేసింది.