చెన్నూర్, పడ్తన్​పల్లి లిప్టులకు బ్రేక్

చెన్నూర్, పడ్తన్​పల్లి లిప్టులకు బ్రేక్

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన చెన్నూర్​, పడ్తన్​పల్లి లిఫ్టులకు బ్రేక్​ పడింది. కాళేశ్వరం బ్యాక్​వాటర్​పై ఆధారపడే ఈ రెండు లిఫ్టు స్కీములకు డిజైన్ ​చేశారు. కానీ, తాజాగా కాళేశ్వరం  ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్​ సర్కారు మళ్లీ ప్రాణహిత బ్యారేజీని తెరపైకి తెస్తోంది. కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మంచిర్యాల జిల్లా చెన్నూర్​ దాకా గ్రావిటీ ద్వారా సాగునీరందించే అవకాశం ఉంటుంది.  

బీఆర్​ఎస్​ ప్లాన్​ ప్లాఫ్​.... 

చెన్నూర్​ నియోజకవర్గాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మూడు బ్యారేజీలు కట్టినప్పటికీ ఈ ప్రాంత రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు నుంచి నియోజకవర్గ రైతులకు చుక్క నీరు రాకపోగా...నాలుగేండ్లుగా బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి. మంచిర్యాల, చెన్నూర్​ పట్టణాలతో పాటు పదుల సంఖ్యలో గ్రామాలు ఏటా వానాకాలంలో జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. 

 ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అప్పటి ప్రభుత్వం ప్రజల కోపాన్ని చల్లార్చేందుకు చెన్నూర్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ను తెరపైకి తెచ్చింది. సాగునీటి పేరిట ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది. మూడేండ్లుగా నాన్చుతూ వచ్చిన కేసీఆర్​ ఈ ఏడాది జూన్​9న ఐడీఓసీ ప్రారంభోత్సవం సందర్భంగా చెన్నూర్​ లిఫ్ట్​ పనులను వర్చువల్​గా ప్రారంభించారు. కానీ, ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓడి కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఈ ప్లాన్​ ప్లాఫ్​ అయ్యింది. 

పడ్తన్​పల్లి కథ కంచికే.... 

హాజీపూర్​ మండలంలోని కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గూడెం లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ నుంచి కూడా అరకొరగానే అందుతున్నాయి. దీంతో హాజీపూర్​ మం డలంలోని 10 వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రూ.85 కోట్లతో పడ్తన్​పల్లి లిఫ్ట్​ స్కీమ్​కు ప్లాన్​ చేశారు. ఇది కూడా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రాజెక్టే. ఈ నేపథ్యంలో చెన్నూర్​, పడ్తన్​పల్లి లిఫ్టులకు బ్రేక్​ పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. 

రూ.6.87 కోట్లు వృథా... 

చెన్నూర్​ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో చెన్నూర్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ను రూపొందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​ వాటర్​ నుంచి 10 టీఎంసీలను ఎత్తిపోసేందుకు మూడు లిఫ్టులను ప్రతిపాదించారు. ఈ సర్వే కోసం మూడు సంవత్సరాల కింద రూ.6.87 కోట్లను సాంక్షన్​ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

నిరుడు ఫిబ్రవరి 1న అప్పటి ఫారెస్ట్​ మినిస్టర్​ అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్​, ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రజత్​కుమార్​ లిఫ్ట్  నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు. ఆ తర్వాత ప్రభుత్వం రూ.1,658 కోట్లతో పరిపాలన అనుమతులను జారీ చేసింది. కానీ, నిరుడు బడ్జెట్​లో పైసా కూడా కేటాయించకపోవడంతో సర్కారు తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. చివరకు అనుకున్నట్టే  జరుగుతుండడం గమనార్హం.