
- వీలైనంత త్వరగా నియమించేందుకు హైకమాండ్ కసరత్తులు
- సీఎం రెడ్డి.. డిప్యూటీ సీఎం ఎస్సీ.. పీసీసీ చీఫ్ బీసీకి?
- పొన్నం, మహేశ్ కుమార్గౌడ్ పేర్లు పరిశీలన
- రేసులో మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కొత్త చీఫ్ను నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం ఢిల్లీ వేదికగా మంతనాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం లోపలే పీసీసీకి కొత్త చీఫ్ను ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. సీఎంగా రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ నేతలు ఉన్న నేపథ్యంలో.. పార్టీ పగ్గాలను బీసీకి అప్పజెప్పాలని, తద్వారా సామాజిక సమతూకం పాటించినట్లు అవుతుందని హైకమాండ్ యోచిస్తున్నట్టు సమాచారం.
బీసీ నేతలపేర్ల పరిశీలన?
పీసీసీ చీఫ్ రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ముందున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్గా రాష్ట్రంలో బలమైన ముద్ర వేసిన పొన్నం ప్రభాకర్కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనలో హైకమాండ్ పెద్దలున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్న ఆయనకు.. పార్టీ పగ్గాలివ్వడం ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అనుసరించిన పంథాలోనే వెళ్లాలన్న భావనలోనూ ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్కుమార్ గౌడ్ పేరునూ పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. వారిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు మధు యాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ పేర్లూ కూడా వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తున్నది. దళిత సామాజికవర్గం నుంచి సంపత్ కుమార్ పేరునూ పరిశీలించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది.
వీక్ సెగ్మెంట్లపై ఫోకస్..
సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే బిజీబిజీగా గడిపేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా రివ్యూలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముంటుంది. ఈ క్రమంలోనే అధికార బాధ్యతలు, పార్టీ బాధ్యతలను ఒకేసారి నడపడం కష్టమని భావిస్తున్న హైకమాండ్.. పీసీసీకి కొత్త చీఫ్ను త్వరగా నియమించాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు కొన్ని సెగ్మెంట్లలో పార్టీ అత్యంత వీక్గా ఉన్నట్టు తేలింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో పార్టీ కనీసం ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లలోనూ ఇతర పార్టీల నుంచి పోటీ అత్యంత తీవ్రంగా ఉన్నది. దాదాపు 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడో స్థానంతోనే పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా సెగ్మెంట్లలో పార్టీ బలహీనతలు, లోపాలను ముందే గుర్తించి సరిచేసుకోవడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని యోచిస్తున్నది. అందుకే వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్ను మార్చాలని హైకమాండ్ భావిస్తున్నది.