
తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం మొత్తం 13 వేల 992 కోట్ల రూపాయలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తెలిపారు. బుధవారం (జూన్ 18) ఖమ్మంలో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అవసరాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీ ఖర్చును వివరించారు.
రాష్ట్రంలో రైతులు 29 లక్షల పంపు సెట్లు వాడుతున్నారని.. రైతుల పక్షాన ప్రతి సంవత్సరం రూ.11 వేల 500 కోట్లు కడుతున్నామని భట్టీ చెప్పారు. అదే విధంగా ప్రజలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకాం 200 యూనిట్లకు ప్రజల తరపున 5 లక్షల 70 వేల132 కుటుంబాలకు 2 వేల293 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. ఇక రాష్ట్రాలోని 29 వేల 18 విద్యా సంస్థలకు198 కోట్లు కట్టినట్లు చెప్పారు. అంటే మొత్తం దాదాపు 14 వేల కోట్లు సబ్సిడీ కోసం ప్రభుత్వం చెల్లించినట్లు చెప్పారు.
కరెంట్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కరెంట్:
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని మిడిమిడి జ్ఞానంతో విపక్షాలు విష ప్రచారం చేశాయని.. కానీ కాంగ్రెస్ అంటేనే కరెంట్....కరెంట్ అంటేనే కాంగ్రెస్.. అని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి కోసం పదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా కట్టలేదని విమర్శించారు.
భవిష్యత్ తరాలకు కరెంట్ అవసరం ఉందని.. అది విస్మరించి 10 ఏళ్లలో ఎనర్జీ పాలసీ ని తుంగలో తొక్కారని అన్నారు. కేవలం 15 వేల మెగావాట్ల సరఫరా చేయగలిగారని చెప్పారు. కానీ తాము అధికారంలోకి వచ్చాకా 20 వేల మెగావాట్ల విద్యుత్ను ఇచ్చామని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా నిమిషం కరెంట్ కట్ కాకుండా ఇచ్చామని..ఇస్తున్నామని గుర్తు చేశారు. 2030 నాటికి 33 వేల 773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ని ఇవ్వబోతున్నామని అన్నారు. రూ.180 వేల కోట్లు పెట్టుబడి పెట్టీ ప్రాజెక్ట్స్ పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం ప్రపంచ దేశాల్లో నూతనంగా వస్తున్న ప్రాజెక్టులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నట్లు భట్టీ చెప్పారు. ఎక్కడో ఒక చోట ట్రిప్ అవుతుందని అది సహజమని అన్నారు. విద్యుత్ సమస్యల కోసం1912 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయొచ్చునని సూచించారు.
విద్యుతు ఉద్యోగుల రక్షణ కోసం త్వరలో విద్యుత్ అంబులెన్స్ లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు భట్టీ. రక్షణ చర్యలకు కావాల్సిన సదుపాయాలు ఈ వాహనంలో ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది కి రక్షణ వస్తువులను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.