
కాంగ్రెస్ పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కారు సీట్లో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో వాళ్లిద్దరూ భేటీ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయమే కేటీఆర్తో వనమా సమావేశమై పార్టీ మారడంపై చర్చించినట్టు సమాచారం. పార్టీలో ఎప్పుడు చేరేది ఒకట్రెండు రోజుల్లో ఆయన స్పష్టతనిచ్చే అవకాశముందని తెలుస్తోంది. కేటీఆర్తో భేటీ తర్వాత ఆయన తిరుమల వెళ్లారు. నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలనూ వెంకన్న దర్శనానికి ఆయన రమ్మని చెప్పినట్టు సమాచారం. అక్కడే పార్టీ మార్పు పై వారితో చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ఇక, సుధీర్రెడ్డి సాయంత్రం కేటీఆర్ను కలిసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లోకి వెళుతున్నట్టు తన అనుచరులతో ఆయన చెప్పినట్టు సమాచారం. ఆయన కూడా రెండ్రోజుల్లో పార్టీలో చేరడంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.