
భద్రాచలం, వెలుగు : ఇన్ఫార్మర్ నెపంతో ఓ కాంగ్రెస్ లీడర్ను మావోయిస్టులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే... చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బండారు నాగ మారేడుబాక సొసైటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం లింగాపురంలో ఓ పెండ్లికి హాజరైన ఆయన తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి లింగాపురం సమీపంలో మావోయిస్టులు నాగను కిడ్నాప్ చేశారు.
తర్వాత సమీప అడవుల్లోకి తీసుకెళ్లి తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నావంటూ కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికుల సమాచారంతో ఊసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆరు నెలల కింద.. బండారు నాగ చిన్న తమ్ముడు తిరుపతిని సైతం ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు హత్య చేశారు.