గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం మరోసారి సమావేశమైంది. రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం కమిటీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ధరణి లోటుపాట్లపై చర్చించామని తెలిపారు.
గత ప్రభుత్వం.. ధరణి పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందన్నారు. ధరణి అనేది ఎవ్వరినీ వదిలిపెట్టలేదని.. ఆ పోర్టల్ లో 35 సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సోమవారం CCLA లో భేటీ తరువాత మరిన్నీ వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా మా కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆనాడు UPA ప్రభుత్వం పెట్టిన ప్రఫోజల్ పై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కోదండరెడ్డి అన్నారు.
గతవారం కూడా ధరణి సమస్యలపై కమిటీ తొలిసారి సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా రెండో సారి భేటీ అయిన కమిటీ.. మరోసారి సమావేశం నిర్వహించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూమాత అనే కొత్త పోర్టల్ ను తీసుకొస్తామని చెప్పారు. అందులో భాగంగానే ధరణి సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ కమిటీ వేసింది.