టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్. గద్వాల అసెంబ్లీ టికెట్ ను రూ. 10 కోట్ల క్యాష్, ఐదెకరాల భూమికి అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే 65 సీట్లను మొత్తం రూ. 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో కష్టపడ్డ వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చారని విమర్శించారు.
కాంగ్రెస్ తొలి జాబితాను పూర్తిగా రద్దు చేసి..మళ్లీ జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు విజయ్ కుమార్ . హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర ఆందోళనకు దిగారు. నాడు ఓటుకు నోటు .. నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని విమర్శించారు. వెంటనే రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
రేవంత్ రెడ్డి అనుచరులు తమను బెదిరిస్తున్నారని..తనకు ప్రాణహాని ఉందన్నారు విజయ్ కుమార్. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరారు. తనకు ఏదైనా అయితే రేవంత్ రెడ్డితే బాధ్యత వహించాలన్నారు.