- మోదీ సర్కార్ పై కాంగ్రెస్ చీఫ్ విమర్శలు
న్యూఢిల్లీ: ఆర్మీలో కీలకమైన అధికారుల పోస్టుల కొరత విషయంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి మోదీ ప్రభుత్వానికి చాలా సమయం ఉంది. కానీ సాయుధ దళాలలో ముఖ్యమైన మేజర్, కెప్టెన్ స్థాయి అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రం టైమ్ లేదు. జాతీయవాదం అని రోజూ ఊదరగొట్టే వారు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కు మరెవరూ చేయనంత ద్రోహం చేశారు" అని ఖర్గే సోమవారం ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్కు ఆర్మీలో మేజర్, కెప్టెన్ స్థాయి అధికారుల కొరతపై ఓ మీడియాలో ప్రచురితమైన రిపోర్ట్ను యాడ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఖర్గే పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వద్ద దేశ సైనికులకు కావాల్సిన నిధులు లేవని అగ్నిపథ్ స్కీమ్ స్పష్టంగా తెలియజేస్తున్నది అన్నారు. వన్ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలులో మోదీ ప్రభుత్వం డిఫెన్స్ కమ్యూనిటీకి ద్రోహం చేసిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి జాతీయ భద్రత జాతీయ ప్రాధాన్యత కాదని, ప్రజల ఆదేశాలకు ద్రోహం చేయడం మాత్రమే వారి ప్రాధాన్యత’’ అని ఖర్గే ఆరోపించారు.