
దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో అక్కడ భార్య ఉంటే—ఇక్కడ కొడుకు బరిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రామలింగారెడ్డి మరణించినట్లే.. శ్రీనివాస రెడ్డి తండ్రి చెరుకు ముత్యం రెడ్డి మరణించాడని, అక్కడ భార్య ఉంటే,ఇక్కడ కొడుకు బరిలో ఉన్నారని అన్నారు.
రామలింగారెడ్డి మరణం బాధాకరమన్న జగ్గారెడ్డి.. దుబ్బాక అభివృద్ధిలో రామలింగారెడ్డి ఎక్కడా కనిపించడని అన్నారు. దుబ్బాక-దొమ్మట అభివృద్ధి లో ప్రతి అణువూ చెరుకు ముత్యం రెడ్డి మాత్రమే కనిపిస్తాడని అన్నారు. 60 చెక్ డ్యామ్ లు- రోడ్లు- అభివృద్ధి పనులు ఎన్నో ముత్యం రెడ్డి చేసినవే కాబట్టి ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి దుబ్బాక ప్రజలు మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని కోరారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి TRS కార్యకర్త లాగా వ్యవరిస్తున్నాడని, అతన్ని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. TRS కు అనుకూలంగా వ్యవరిస్తే సిద్దిపేట కలెక్టర్ పదవి విరమణ అయ్యాక కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని, మిగతా అధికారులకు కూడా ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు.