తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ ను సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల కోసం వినతి పత్రాన్ని కేటీఆర్ కు అందించారు జగ్గారెడ్డి. మంత్రి కూడా వాటిపై సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పనులను పూర్తి చేస్తామని జగ్గారెడ్డికి హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
నిత్యం ప్రజాక్షేత్రంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకునే వీరిద్దరూ అసెంబ్లీ ప్రారంభం కావడానికి ముందు.. అసెంబ్లీ ఆవరణలో కలసి నవ్వుతూ మాట్లాడుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ALSO READ:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు రేపటికి 2023 ఆగస్టు 04 తేదీ శుక్రవారం వాయిదా పడ్డాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశంలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళులర్పించింది. ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మాణం ప్రవేశపెట్టగా సభ్యులు తీర్మాణాన్ని బలపర్చారు.
కంటోన్మెంట్ అభివృద్ధికి ఎంతో సాయన్న తపన పడ్డారని .. పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిదని కేసీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో కలపాలని సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం గుర్తుచేశారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్, సభ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.