తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే

మరికాసేపట్లో ప్రారంభంం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గైర్హాజరు కానున్నారు. వనమా ఎన్నిక చెల్లదంటూ ఇటీవలే హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఆయన ఎమ్మెల్యే  పదవికి అనర్హుడని పేర్కొంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వనమా పిటిషన్ విచారణ తేదీపై రేపు సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన వనమా.. 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అనేక గెలుపోటములు చవి చూసినట్టు చెప్పారు. తాను ప్రజాస్వామ్య బద్ధంగానే కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందానని, ప్రజాబలం ఉండడం వల్లే విజయం సాధించానన్నారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తుది వరకు తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్న ఆయన.. అక్కడే ఉండి తేల్చుకుంటానని తేల్చి చెప్పారు. తనకు బీఆర్ఎస్ అధిష్ఠానం అండదండలు కూడా ఉన్నాయని వనమా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ALSO READ:పేద ప్రజల సేవ కోసమే కాకా ఫౌండేషన్: డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన వనమా.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారంటూ.. రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఇటీవలే తీర్పు వెలువరించింది. వనమా ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అంతేకాకుండా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది.