రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఖర్చు పెట్టే వేల కోట్ల రూపాయలు నిజమైన రైతులకు, లబ్ధిదారులకు, అర్హులకు దక్కాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శనివారం అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రైతు బంధు మంచి పథకం అని చెప్పిన కోమటిరెడ్డి.. రైతులకు ఎలాంటి సాయం చేసినా మంచిదేనన్నారు. అయితే రాష్ట్రంలో 70 శాతం మంది భూస్వాములు తమ పొలాలను కౌలుకి ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు డబ్బులు వ్యవసాయం చేసే వారికి కాకుండా ల్యాండ్ ఓనర్స్ కు దక్కుతున్నాయని అన్నారు.
రాజకీయ నేతల్లో కూడా చాలామంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాళ్ళు ఉన్నారన్న రాజగోపాల్ రెడ్డి.. తన ఖాతాలో కూడా రైతుబంధు నిధులు క్రింద రూ.3లక్షలు జమయ్యాయన్నారు. తనలాంటి వేలమంది భూస్వాములకు, లక్షలకు పెద్ద రైతులకు కూడా ప్రభుత్వం డబ్బులిస్తోందని విమర్శలు చేశారు. తనలాంటి వాళ్లకు రైతుబంధు డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము ప్రతిపేద రైతుకు అందాల్సిన అవసరముందన్నారు. రైతుబంధు కింద ఇచ్చే నిధులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ఇదే డబ్బు ఖర్చు చేస్తే.. వ్యవసాయం చేసే ప్రతివ్యక్తికి లాభం చేకూరుతుందన్నారు కోమటిరెడ్డి.