
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో చేసిన ప్రకటన తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 80 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘‘హుజురాబాద్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తానని సీఎం చెప్పారు. ప్రభుత్వమే నియమించిన బిస్వాల్ కమిటీ లక్షా 91 వేలు ఖాళీలు ఉన్నాయని గత ఏడాది నివేదిక ఇచ్చింది. మధ్యలో ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఆ ఖాళీలు ఎట్ల తగ్గినయ్?’’ అని కోమటిరెడ్డి అడిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దానిని తుంగలోకి తొక్కారని అన్నారు. ఆ సమయంలో ఓట్ల కోసమే ప్రకటన చేశారని, తర్వాత దాని ఊసే ఎత్తలేదంటూ తప్పుబట్టారు. కేసీఆర్ ఈ విషయాన్ని అంగీకరించి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నామంటూ యువతకు క్షమాపణ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు.