ఇంటింటికీ కిలో బంగారం ఇచ్చినా కేసీఆర్ గెలవడు : ఎంపీ కోమటిరెడ్డి

ఇంటింటికీ కిలో బంగారం ఇచ్చినా కేసీఆర్ గెలవడు : ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఒకవేళ తమకు అధికారమే ముఖ్యమనుకుంటే సోనియాగాంధీ రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యేవారని వ్యాఖ్యానించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయ్యిందన్నారు. కేసీఆర్ అత్యంత కుబేరుడిగా మారాడన్నారు. తాము ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. 

ALSO READ: కేసీఆర్ పాలన అవినీతిమయం.. అమరవీరుల కల సాకారం కావాలంటే బీఆర్ఎస్ ను బొందపెట్టాలె
 
ఇవాళ రాష్ర్టంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దేశం మొత్తానికి ఎన్నికల ఖర్చు పెట్టే స్థాయికి కేసీఆర్ వచ్చాడంటే గుండె తరుక్కుపోతోందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. 

ప్రతి ఇంటికీ కిలో బంగారం ఇచ్చినా బీఆర్ఎస్ గెలవదన్నారు. రైతులకు కనీసం రుణమాఫీ కూడా చేయలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరే నేతలకు సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌరవించి..నాయకులు కాంగ్రెస్ లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. పాత, కొత్త నేతల కలయికతో కేసీఆర్ ను ఎదుర్కొంటామన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడని మండిపడ్డారు. ఇంటర్ పేపర్లను సరిగ్గా దిద్దలేక చాలామంది విద్యార్థులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదన్నారు. 

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్ ను గద్దె దిగేలా ఖమ్మంలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఖమ్మం సభకు వచ్చే వారికి తాము డబ్బులు ఇవ్వమని, ప్రజలే స్వచ్చందంగా తరలివచ్చి.. విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోసమే బీసీలకు లక్ష రూపాయల పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఒక ఇంట్లో దంపతులు ఇద్దరు అర్హులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పింఛన్ ఇస్తున్నారని చెప్పారు.