హైదరాబాద్, వెలుగు: అమిత్షా ప్రసంగ వీడియోలో మార్పులు చేశారంటూ ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ పార్టీకి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిటిషన్ వేశారు. హోంశాఖ, డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ ఎస్పీ, ప్రభుత్వ ఉద్యోగులు మీరాజ్, శింకు శరణ్ సింగ్ ను ప్రతివాదులుగా చేర్చారు. దీన్ని హైకోర్టు గురువారం విచారించనుంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంటే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఢిల్లీలోని ఓ గవర్నమెంట్ఉద్యోగి శింకు శరణ్ సింగ్ అక్కడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు.
వీడియో మార్పు అంశంపై బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ కేసులో నిందితుల అరెస్టు, బెయిల్పై విడుదల జరిగిపోయాయన్నారు. అదే అంశంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం చెల్లదన్నారు. మణికొండలో ఉంటున్న కాంగ్రెస్ కన్సల్టెంట్ మంద శ్రీప్రతాప్ ఇంట్లోకి సుమారు 20 మంది వెళ్లి ఆయన సొంత వస్తువులను సీజ్ చేశారన్నారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులు అక్రమంగా ఇండ్లలోకి ప్రవేశించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.