- టెర్రరిస్టులకు కాంగ్రెస్ షెల్టర్
- కాంగ్రెస్ లీడర్లపై ప్రధాని మోడీ ఫైర్
- అభివృద్ధి, శాంతి అంటే నచ్చదని కామెంట్
- ఇండియా పరువు తీస్తున్నరని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ ప్రధాని
- ఆ పార్టీ పవర్లోకి వస్తే ఇన్వెస్టర్లు పారిపోతారని ఎద్దేవా
- విభజించు పాలించు సిద్ధాంతం అమలు చేస్తున్నరు
- ముల్కీ బహిరంగ సభలో మోడీ విమర్శ
ముల్కీ (కర్నాటక): కాంగ్రెస్ది విభజించు పాలించు సిద్ధాంతమని, ఇండియాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచమంతా పొగుడుతుంటే.. కాంగ్రెస్ లీడర్లు మాత్రం విమర్శిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. గ్లోబల్గా ఇండియా పరువు తీస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ కన్నడ జిల్లాలోని ముల్కీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ను బ్యాన్ చేస్తా అంటున్నది. అదే జరిగితే రాష్ట్రంలో అశాంతి రాజ్యమేలుతుంది. డెవలప్మెంట్, పీస్ అంటే కాంగ్రెస్కు అస్సలు నచ్చదు. ఆ రెండింటిని కాంగ్రెస్ పార్టీ శత్రువుగా చూస్తుంది. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ సేవలను కూడా అవమానిస్తున్నది. ఆ పార్టీ పవర్లోకి వస్తే ఇన్వెస్టర్లు రాష్ట్రం వదిలి పారిపోతారు”అని కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టులకు కాంగ్రెస్ పార్టీ షెల్టర్ ఇస్తున్నదని మోడీ ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలే ఆ పార్టీ నైజమని విమర్శించారు. ‘‘ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? కర్నాటకను నాశనం చేయడానికి మీరు అనుమతిస్తారా? దేశం మొత్తం పీస్, డెవలప్మెంట్ కోరుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం వీటికి వ్యతిరేకం. ఎక్కడ శాంతి ఉంటే.. అక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. కానీ, కాంగ్రెస్ శాంతిని కోరుకోవడం లేదు. డెవలప్మెంట్ అంటేనే కాంగ్రెస్కు ఇష్టం లేదు. విభజించు, పాలించు సిద్ధాంతాన్ని అమలు చేసేందుకే ఇష్టపడ్తది” అని మోడీ విమర్శించారు.
మన సైనికులను అవమానిస్తున్నరు
ఎన్నికల్లో గెలిచేందుకు యాంటీ నేషనల్ ఫోర్స్ హెల్ప్ తీసుకుంటున్నదని మోడీ ఆరోపించారు. ‘‘దేశం మొత్తం మన సైనికులను గౌరవిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అవమానిస్తున్నది. సైనికుల త్యాగాలంటే లెక్క లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే ఇలా ఎన్నో దేశాలు ఇండియాను పొగుడుతున్నాయా? లేదా? దీనంతంటికీ కారణం మోడీ కాదు.. మీరు వేసిన ఓట్లే..”అంటూ ప్రజలనుద్దేశించి మోడీ అన్నారు. ఓటు ఎంతో శక్తివంతమైందని, దేశంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడాలంటే ఇది ఎంతో కీలకమని తెలిపారు.
కర్నాటకను దేశంలోనే నంబర్ వన్ చేస్తం
ఇండస్ట్రియల్తో పాటు అగ్రికల్చర్ సెక్టార్లో కర్నాటకను దేశంలోనే నంబర్ వన్ పొజిషన్లో ఉంచడమే తమ లక్ష్యమని మోడీ అన్నారు. ఫిషరీస్తో పాటు పోర్టు రంగాన్ని కూడా డెవలప్ చేస్తామని తెలిపారు. భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించాలని కోరారు. బహిరంగ సభలో కర్నాటక బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కతీల్, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజేతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.
ఓటేస్తూ ‘జై బజరంగబలి’ అనండి
అంకోలా (కర్నాటక): ఇండియన్ కల్చర్, దేవుళ్లను కాంగ్రెస్ అవమానించిందని, ప్రతి ఒక్కరూ ఓటేసే టైంలో ‘జై బజరంగ్బలి’ అని నినాదాలు చేయాలని ప్రజలను ప్రధాని మోడీ కోరారు. ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా సమీపంలోని గౌరికెరె గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నన్ను కాంగ్రెస్ తిడుతున్నది. రిటైర్ అవుతున్న లీడర్ల పేరుతో ఓట్లు అడుగుతున్నది. మోడీని తిడితే ఓట్లు పడ్తాయని భావిస్తున్నది. కల్చర్ను అవమానిస్తే మీరు ఊరుకుంటారా? ఎవరైనా ఎవరినైనా దూషిస్తుంటే ఇష్టపడుతారా? వారికి మీరే ఓటుతో బుద్ధి చెప్పాలి. పోలింగ్ బూత్లో బటన్ నొక్కేటప్పుడు జై బజరంగ బలి అని అరిచి శిక్షించండి”అని ఓటర్లను మోడీ కోరారు. తప్పుడు ఆరోపణలు, హామీలకే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు.
4 కోట్ల ఫేక్ అకౌంట్లు రద్దు చేసినం
అధికారంలో ఉన్న టైంలో లక్ష ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి గ్యాస్ సబ్సిడీ డబ్బులు లూటీ చేశారు. 30 లక్షల నకిలీ ఖాతాలతో ఎడ్యుకేషన్, ట్రైనింగ్కు చెందిన సబ్సిడీలు లూటీ చేశారు. కోటి మంది వితంతువుల పింఛన్లను నకిలీ అకౌంట్లతో అవినీతికి పాల్పడ్డారు. ఇలా మొత్తం నాలుగు కోట్ల నకిలీ ఖాతాలతో లక్షల కోట్ల ప్రజల డబ్బును లూటీ చేశారు.రూ.2.75లక్షల కోట్లను అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లనివ్వకుండా నాలుగు కోట్ల అకౌంట్లను రద్దు చేశాం.
- ప్రధాని నరేంద్ర మోడీ