తెలంగాణ నగర, పట్టణ ఓటర్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ ఆధిక్యత పరంపర లోక్సభ ఎన్నికలు, రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల క్రమంలోనే... ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తున్నట్టు క్షేత్ర సమాచారం చెబుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరిగిన పోలింగ్ సరళిని ‘పీపుల్స్పల్స్’ బృందం అతి సమీపంగా గమనించినపుడు ఇదే స్పష్టమైంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇంకో విపక్ష పార్టీ బీజేపీ ‘హైప్’ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయి ప్రజా మద్దతును కూడగట్టలేకపోయింది. కాంగ్రెస్ తరపున అన్నీ తానై ఎన్నికల ప్రక్రియకు నేతృత్వం వహించిన సీఎం రేవంత్రెడ్డి పార్టీలో మరింత బలపడే అవకాశం ఉంది.
ముస్లిం ఓటర్లలో పట్టున్న మజ్లీస్ పార్టీ ఉనికి చాటుకుంటుంటే ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు తమ ఉనికి వెతుక్కుంటున్నారు. సీపీఎంకు బీఆర్ఎస్తో పొత్తుంటే, సీపీఐ, ఎం.ఐ.ఎంలు కాంగ్రెస్తో పొత్తు లేకుండా విడిగానే పోటీచేశాయి.
మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఆధిక్యతను కొనసాగించనుంది. తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు (7), మున్సిపాలిటీల (116) కు జరిగిన ఈ ఎన్నికల్లో పాలకపక్షం కాంగ్రెస్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. మరో విపక్షమైన బీజేపీ రెండు, మూడు కార్పొరేషన్లు, అక్కడక్కడ మున్సిపాలిటీల్లో తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
నగరాలు, పట్టణాల్లోని ఓటరు ఆలోచన భిన్నంగా ఉంటుందనే జనాభిప్రాయం పనిచేసినట్టు లేదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యపు జాడలే ప్రస్ఫుటమయ్యాయి. బుధవారం సాయంత్రం ముగిసిన పోలింగ్ సరళినిబట్టి కాంగ్రెస్ సుమారుగా 36 శాతం ఓటు వాటాను పొందే అవశాశమున్నట్టు ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ సర్వే అంచనా వేసింది. 116లో 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. 29.7 శాతం ఓటు వాటాతో 29 నుంచి 36 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయవచ్చు.
ఎజెండా సెట్ చేయలేకపోయి...
ప్రధాన ప్రతిపక్షమై కూడా మీడియా ప్రభావం అధికంగా ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో పౌర సమస్యల్ని ప్రధానంగా చర్చకు తెచ్చి రాజకీయ ‘ఎజెండా సెట్’ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది. అధికార పక్షం పన్నిన విమర్శ- ప్రతి విమర్శ, తిట్లు- కౌంటర్ల చక్కర్లో పడిపోయింది. ఓటు వాటా, మొత్తం మున్సిపాలిటీలపరంగా బీజేపీని ముందుకు రానీయకుండా, రెండో స్థానాన్ని మాత్రం బీఆర్ఎస్ ఖాయం చేసుకుంటోంది.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో భేటీని బహిష్కరించడం వంటి వ్యూహపరమైన తప్పిదాలు పార్టీని వెనుకంజలోకి నెట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హడావుడి చేసి కడకు తుస్సుమన్నట్టు కాకుండా ఈసారి బీఆర్ఎస్ కొంత నిశ్శబ్దంగా, చాపకింద నీరులా విస్తరించే యత్నం చివరి దశలో చేసింది. ఇంకొంత ముందునుంచే శ్రమించి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది.
కొందరు నాయకులు వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన చోట ఫలితాల సానుకూలతకు అవకాశముంది. మున్సిపల్ ఎన్నికల్లో ‘బిజీ’ ఉన్నానంటూ టెలిఫోన్ టాపింగ్’ విచారణకు వ్యవధి కోరిన పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంపై అంతగా దృష్టిపెట్టినట్టు కనిపించదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ (2024) ఎన్నికల్లో ‘జీరో’ ఫలితాలు, రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్) సొంత స్థానాల్ని కోల్పోవడం, సర్పంచ్ ఎన్నికల్లో వెనుకంజ దిశలోనే ఈ ఫలితాలు కూడా ఉంటే, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చుక్కెదురు తప్పకపోవచ్చు.
ఇదంతా పార్టీ అధినేతకు తెలుసు, పాలకపక్షానికి సానుకూలత ఉండే స్థానిక ఎన్నికల్లో ఓడినా 2028 ఎన్నికలపై దృష్టి నిలిపి, ‘జాక్పాట్’ కొట్టాలనేది తమ అధినేత వ్యూహమని నమ్మేవాళ్లూ బీఆర్ఎస్లో ఉన్నారు. 2020 స్థానిక ఎన్నికల్లో 120లో 109 మున్సిపాలిటీలు, మొత్తం 10 కార్పొరేషన్లు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా 2023 ఎన్నికల్లో తమకు తప్పని ఓటమిని వారు గుర్తు చేస్తున్నారు.
అలవాటుగా గెలుపు...
క్రియాశీల పీసీసీ అధ్యక్షుడున్నప్పటికీ, ఇటు ముఖ్యమంత్రిగా అటు పార్టీ ముఖ్యనేతగా రేవంత్రెడ్డి అన్నీ తానై ఎన్నికల బరువు బాధ్యత తీసుకున్నారు. స్వయంగా పలు జిల్లాలు పర్యటిస్తూ ఎన్నికల ప్రత్యక్ష-పరోక్ష ప్రచారంలో పాల్గొన్నారు. వనరుల్ని సమకూర్చారు. గెలుపు మంత్రం జపిస్తూ మంత్రుల్ని పురమాయించారు. దావోస్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా... ఎన్నికల సమీక్షలు జరిపారు.
మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పగించి, ‘గెలుపు పూచీకత్తు మీదే’ అని వారిని పరుగులెత్తిస్తున్నారు. మెజారిటీ మంత్రులు తమకు అప్పగించిన బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్తో సహా పలు ప్రజాసంబంధమైన కీలకాంశాల్లో విమర్శలు చేస్తూ, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ను ‘డిఫెన్స్’లోకి నెట్టడంలో సఫలమయ్యారు. స్థాయికి తగ్గట్టు లేదని, ఆయన ఉపయోగించే ‘భాష’ విషయంలోనే పౌర సమాజం నుంచి విమర్శలొస్తున్నాయి.
వరుసగా విజయాలను పార్టీకి అలవాటు చేస్తున్న ఆయన తాజా ఎన్నికల్లోనూ ఆధిక్యత ద్వారా పార్టీలో, అధిష్టానం వద్ద మరింత బలోపేతం కావడం ఖాయం. జూబ్లీహిల్స్లో మద్దతిచ్చిన మజ్లీస్తో పొత్తు పెట్టుకోకుండా, ప్రత్యర్థి బీజేపీవైపు హిందూ ఓటు ఏకీకృతం కానీయకుండా జాగ్రత్తపడ్డారు. మజ్లీస్ పోటీలో లేని చోట ముస్లిం ఓటర్ల మద్దతు తమకేననే గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఈ విషయంలో, బీఆర్ఎస్ కన్నా బీజేపీని ఓడించగలిగేది కాంగ్రెస్ అభ్యర్థులే అన్న విశ్వాసం వారిలో కలిగించడం తమకు అనుకూలించే అంశమని పార్టీ విశ్వసిస్తోంది.
పార్టీ నిర్మాణ కొరతే లోపం
నగర- పట్టణ పార్టీగా పేరున్నప్పటికీ బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించినస్థాయి ఓటరు మద్దతు పొందలేకపోతోంది. సంస్థాగత నిర్మాణం, స్థానికాంశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో వ్యూహం కొరవడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి సభ మహబూబ్నగర్లో ఏర్పాటు చేయడం, పొరుగుననున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రచారం చేయడం, అన్ని ప్రధాన పత్రికల్లో పోలింగ్ రోజు మొదటి పేజీ ఎన్నికల ప్రచార ప్రకటన వంటి ‘హైప్’ తీసుకురాగలిగినప్పటికీ, క్షేత్రంలో అందుకు సమానస్థాయి వ్యవస్థను వృద్ది చేయలేకపోయింది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లోక్సభ స్థానం తప్ప మిగతా ఏడు లోక్సభ స్థానాల కిందా ప్రస్తుత కార్పొరేషన్, -మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఆ సంఖ్యలోనైనా మున్సిపాలిటీలు దక్కుతాయా? అన్నది సందేహమే! కార్పొరేషన్లలో తప్పక గెలిచే స్థానమంటూ లేదు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఆధిక్యతకు స్పష్టమైన సంకేతాలున్నా... పార్టీ పరంగాకన్నా ఎంఐఎం బూచి చూపడం, మొలతాడు నినాదం, ‘హిందూత్వ’ వాదం, ఒక బలమైన ‘సామాజికవర్గ మద్దతు’ వంటి అంశాల పరంగానే బీజేపికి అది దక్కుతున్నట్టు సమాచారం.
ముస్లిం జనాభా అధికంగా ఉన్న నగర, పట్టణ ప్రాంతాల్లో ఎప్పట్లాగే ఎం.ఐ.ఎం తన ప్రభావం చూపనుంది. కార్పొరేషన్లలోనే కాకుండా కొన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రధానపార్టీల గెలుపోటముల్ని అది ప్రభావితం చేయనుంది. కొత్తగూడెంలో బీఆర్ఎస్తో సీపీఎం పొత్తుపెట్టుకుంది. ఇదివరలో కాంగ్రెస్తో సఖ్యతగా ఉన్న సీపీఐ ఇప్పుడు విడిగానే పోటీ చేస్తోంది. తన వారికి దూరమై వేరు కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత ప్రభావం ఏమీ లేనట్టే! ఇదీ, తెలంగాణ
మున్సిపల్ ముఖచిత్రం!
బీఆర్ఎస్కు ఏమీ దక్కకపోవచ్చు..
మొత్తం మున్సిపాలిటీల్లో 3 నుంచి 5 చోట్ల బీజేపికి, ఒక మున్సిపాలిటీలో ఎం.ఐ.ఎంకి గెలుపు అవకాశాలున్నట్టు సమాచారం.
8 నుంచి 14 చోట్ల పోటీ నువ్వా- నేనా అన్నట్టుగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. లోక్సభ ఎన్నికల్లోలాగ కార్పొరేషన్లలోనూ బీఆర్ఎస్కు ఏమీ దక్కకపోవచ్చని సర్వే అంచనా చెబుతోంది. నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం నాలుగు కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉండగా, మిగతా చోట్ల గట్టి పోటీదారుగా నిలిచింది.
నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశమున్న బీజేపీ మహబూబ్నగర్ లోనూ గట్టి పోటీదారుగా ఉంది. ఎం.ఐ.ఎం సహకారంతో కాంగ్రెస్ మహబూబ్నగర్లో ఆధిక్యత సాధించవచ్చు. పూర్వపు మెదక్ జిల్లాలో, పాత రంగారెడ్డిలోని మేడ్చల్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్కు ఎంతో కొంత ఊరట, అదీ హరీష్రావు పుణ్యమా అని లభించే అవకాశం కనిపిస్తోంది.
కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలుచోట్ల ప్రచారం చేసినా పూర్తి బాధ్యత తీసుకున్నది సిరిసిల్ల, వేములవాడ వంటి కొన్ని చోట్ల మాత్రమే కావడంతో ప్రచార బాధ్యత ప్రధానంగా హరీష్పైనే ఒరిగింది.
-
దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
