- బోధన్లో రెండోసారి తూము పద్మ రికార్డ్
- ఆర్మూర్, భీంగల్లో దక్కిన అవకాశాలు
- ఫలించిన కాంగ్రెస్ మంత్రాంగం
- కామారెడ్డిలో చైర్పర్సన్ దక్కించుకున్న కాంగ్రెస్
- బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో అన్ని పదవులు కాంగ్రెస్కే
నిజామాబాద్ /కామారెడ్డి, వెలుగు : నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల్లో మేయర్, చైర్ పర్సన్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్దక్కించుకుంది. అధిక శాతం చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పదవులు మహిళలకు ఇచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. మజ్లిస్తో పొత్తులో భాగంగా బోధన్ వైస్ చైర్పర్సన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ పదవి పురుషులకు వెళ్లగా డిప్యూటీ మేయర్, భీంగల్లో వైస్ చైర్పర్సన్పోస్టును మహిళలే దక్కించుకున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్ఏర్పడగా ఇండిపెండెట్లు పార్టీలో చేరినా బలం సరిపోకపోవడంతో బీఆర్ఎస్తో జత కట్టాల్సి వచ్చింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు సరిపడా ఓట్లు ఉండడంతో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్లను దక్కించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి సవాల్గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు సక్సెస్ సాధించి కార్యకర్తల్లో జోష్ పెంచారు.
చివరి నిమిషంలో బోధన్లో చేంజ్
మున్సిపల్ చైర్పర్సన్లుగా రెండోసారి ఎన్నికైన దాఖలా జిల్లాలో ఎక్కడాలేదు. ఆ రికార్డును బోధన్లో తూము పద్మ సొంతం చేసుకున్నారు. అక్కడి ఓటర్లు హంగ్ తీర్పునివ్వగా మజ్లిస్ సపోర్ట్తో కాంగ్రెస్ చైర్ పర్సన్ పదవి దక్కించుకుంది. 26 వార్డ్ కౌన్సిలర్ అంకు దాము పేరును మొదట పార్టీ డిసైడ్ చేశాక హైదరాబాద్ క్యాంపులో ఉన్న పార్టీ కౌన్సిలర్లందరూ బోధన్ వచ్చారు. ఇంతలో మారిన సమీకరణలతో తూము పద్మ పేరు అనూహ్యరీతిలో తెరపైకి రాగా మజ్లిస్, కాంగ్రెస్ కౌన్సిలర్లంతా ఆమోదించారు. చైర్పర్సన్ ఎన్నిక ముగిసే దాకా ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. 2020లో ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున చైర్పర్సన్గా ఐదేండ్లు పని చేసిన తూము పద్మ ఈసారి జనరల్ సీటులో కూర్చున్నారు. మజ్లిస్ కి చెందిన టౌన్ ప్రెసిడెంట్ మీర్ఇలియాస్ అలీ 18వ వార్డు నుంచి గెలిచి వైస్ చైర్పర్సన్అయ్యారు.
భీంగల్లో పోటా పోటీ..
సొంత మండలం భీంగల్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్మహేశ్గౌడ్ చక్రం తిప్పారు. అన్ రిజర్వ్ మహిళకు కేటాయించిన చైర్పర్సన్ స్థానాన్ని అక్కడ గెలిచిన నలుగురు కౌన్సిలర్లు ఆశించారు. వారిని సర్దుబాటు చేయడానికి పార్టీ ముఖ్య నేతలు తలపట్టుకున్నారు. చివరకు రాజీ కుదుర్చి బొదిరె నాగమణిని చైర్పర్సన్గా సంటి లతను వైస్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఐదేండ్ల పదవీ కాలాన్ని మిగతా ఇద్దరు కౌన్సిలర్లు ఆరెపల్లి శ్రీజ, పర్శ కుశలత పంచుకునేలా నేతలు ఒప్పందం చేసినట్లు సమాచారం. భీంగల్ మున్సిపాలిటీ ఏర్పడ్డాక జరిగిన రెండో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
2006 తరువాత ఆర్మూర్లో కాంగ్రెస్ జెండా..
ఆర్మూర్ గ్రామ పంచాయతీ 2006లో మున్సిపాలిటీగా మార్చాక జరిగిన మొదటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తరువాత 2014, 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి జరిగిన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పరిగణించిన పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపిక నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా 20 ఏండ్ల తరువాత అక్కడి మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతం చేసుకోగా గోనె లహరి చైర్ పర్సన్గా గెలించారు. వైస్ చైర్పర్సన్పదవి కాటిపల్లి వెంకట్రెడ్డికి దక్కించుకున్నారు. గత పదేండ్లు జిల్లాలోని నగర పాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు మహిళల ఆధిపత్యం కిందే నడిచాయి. ఇప్పుడు కూడా మరోసారి వారే పాలన నిర్వహించి సత్తా చాటే అవకాశం పొందారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్...
కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్ 11, బీజేపీ 19, ఇండిపెండెంట్లు 3 గెలిచారు. ఇండిపెండెంట్లు కాంగ్రెస్లో చేరగా, ఆ పార్టీ బలం 22కు చేరింది. చైర్పర్సన్ పదవికి ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ జత కలిశాయి. బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఇప్ప ఉమారాణికి చైర్పర్సన్ పదవి దక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా పదవుల విషయంలో అవగాహనకు వచ్చాయి. కాంగ్రెస్కు చైర్పర్సన్, బీఆర్ఎస్కు వైస్ చైర్పర్సన్తో పాటు ఒక కో అప్షన్ పదవి కూడా ఇవ్వనున్నారు.
చైర్పర్సన్గా ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ కి చెందిన కౌన్సిలర్ ఎండీ ఇషాక్ మహమ్మద్ ప్రతిపాదించగా, అంజాద్ బలపర్చారు. బీజేపీ తరఫున ఆ పార్టీ కౌన్సిలర్ జి.సుజీత పోటీ చేయగా ఈమె పేరును ప్రీతి గోర్వత్ ప్రతిపాదించగా, కాసర్ల రాణి బలపరిచారు. కాంగ్రెస్ అభ్యర్థికి 33 ఓట్లు , బీజేపీ అభ్యర్థికి ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డితో కలిసి 17 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణిని చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైస్ చైర్పర్సన్కు బీఆర్ఎస్ నుంచి కాసర్ల గోదావరి ఎన్నికైనట్లు ప్రకటించారు.
మిగతా 3 చోట్ల ...
బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మూడు చోట్ల కాంగ్రెస్ కే మెజార్టీ వచ్చిన దృష్ట్యా ఎలాంటి పొత్తులు లేకుండా పదవులను దక్కించుకుంది. పార్టీ తరఫున ఆయా చోట్ల ఒక్కొక్కరు మాత్రమే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు పోటీ చేయటంతో ఏకగ్రీవమయ్యాయి.
మహిళలకే 7 పదవులు..
జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ పదవులు మొత్తం 8కి గాను 7 పదవులు కూడా మహిళలకు దక్కాయి. కామారెడ్డి చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వు కాగా ఇప్ప ఉమారాణికి అవకాశం ఇవ్వగా, వైస్ చైర్పర్సన్ కూడా బీసీ వర్గానికి చెందిన మహిళకే ఇచ్చారు. బాన్సువాడలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ 2 పదవులు కూడా మహిళలకు కట్టబెట్టారు. ఎల్లారెడ్డిలో చైర్పర్సన్ పదవి అన్రిజర్వుడు కాగా, ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన పద్మ శ్రీకాంత్కు చైర్పర్సన్ పదవి ఇచ్చి వైస్ చైర్పర్సన్పదవిని మహిళకు ఇచ్చారు. బిచ్కుంద లో 2 పదవుల్లో మహిళలకే అవకాశం ఇచ్చారు.
