కేటీఆర్ టూర్లో వాల్ పోస్టర్ వార్

కేటీఆర్ టూర్లో వాల్ పోస్టర్ వార్
  • కేటీఆర్ టూర్లో వాల్ పోస్టర్ వార్
  • ఖమ్మంలో కాంగ్రెస్ నగరాధ్యక్షుడు పేరుతో పోస్టర్లు
  • పోస్టర్లను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఖమ్మంలో పోస్టర్ల వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రచార పోస్టర్లను ఖమ్మం నగరంలో అంటించగా వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. పోస్టర్ల చింపివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఇవాళ (సెప్టెంబర్ 30న) ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. వారి రాక కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల గురించి ఖమ్మం నగరంలో పోస్టర్లను అంటించారు. ఖమ్మం నగరంలోని ఆయా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించగా కొన్ని చోట్ల పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచార పత్రాలు ఖమ్మం జిల్లా మొత్తం అతికించి, భారీగా కౌటట్లు పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేవలం పోస్టర్లను అతికించుకుంటే చింపడం ఎంత వరకు సమంజసమని పీసీసీ సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎండి.జావిద్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పోస్టర్లను చించేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రుల టూర్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.