తెలంగాణలో కాంగ్రెస్ ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుంది :  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  ఆర్థిక సంక్షోభంతో ఉన్న తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని..  ప్రభుత్వానికి  కొంచెం సమయం కావాలన్నారు.  ఇప్పటికే  రైతుల రుణమాఫీ ఆగస్టులో చేస్తామని సీఎం ప్రకటించారని చెప్పారు.  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత  స్థాయి సమావేశంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.  

బీఆర్ఎస్ లీడర్  పైళ్ళ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లోకి  రావాలని చూశారని...కానీ  ఆయనకు టిక్కెట్ ఇవ్వమని చెప్పామన్నారు రాజగోపాల్ రెడ్డి.  భువనగిరి పార్లమెంట్ టికెట్ తన భార్య లక్ష్మీ ప్రయత్నించారన్న  ప్రచారం ఆవాస్తమని చెప్పారు.  యువజన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి సేవలను గుర్తించి అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్  కేటాయించిందని తెలిపారు.  

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.  కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు అప్పు చేసి నిర్మిస్తే కూలిపోయిందన్నారు.  కిరాయి ఇంట్లో ఉండే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి రూ. 1000 కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపామని..   కవితను జైలుకు పంపామన్నారు. ఇప్పుడామే జైలులో బతుకమ్మ ఆడుతదని ఏద్దేవా చేశారు.   ప్రజల కోసం,వ్యాపారాలు వదిలి తాము సేవ కోసం పని చేస్తున్నామన్నారు  రాజగోపాల్ రెడ్డి. జనగామలో మహిళా వృద్ధాశ్రమం కట్టించామని చెప్పారు. ప్రజల కోసం  స్వంత పైసలు ఖర్చు చేశామని..   స్వంత డబ్బు పెట్టి కాల్వలు నిర్మించామని తెలిపారు.