యూఎస్ ప్రెసిడెంట్ వివాదాస్పద ట్వీట్
ట్రంప్ రేసిస్ట్ అని విమర్శిస్తున్న నెటిజెన్లు
కరోనా వైరస్ ధాటికి అమెరికా కూడా కుదేలవుతోంది. ఈ టైంలో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘చైనీస్ వైరస్ వల్ల ఎయిర్లైన్స్ సహా అమెరికాలోని చాలా ఇండస్ట్రీలు నష్టపోతున్నాయి. వాటిని ఆదుకుంటాం’ అని ట్రంప్ చేసిన ట్వీట్ వైరలైంది. కరోనాను చైనీస్ వైరస్ అనడంపై ట్విట్టర్లో విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ రేసిస్ట్ (జాత్యహంకారి) అంటూ చాలా మంది మండిపడుతున్నారు. వైరస్కు దేశమంటూ ఉండదని తిట్టిపోస్తున్నారు. ‘మీరు పాలిస్తున్న ఆసియా=అమెరికా కమ్యూనిటీ ప్రజలు ఇప్పటికే కరోనా దెబ్బకు సతమతమవుతున్నారు. ఇంకా మంట పుట్టించాలని చూడొద్దు’ అని న్యూయార్క్ సిటీ మేయర్ ట్వీట్ చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై చైనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను చైనా సీనియర్ దౌత్యవేత్త యంగ్ జేచీ తప్పుబట్టారు. యూఎస్ ప్రెసిడెంట్ కామెంట్లు సరికాదని విమర్శించారు. వైరస్ వ్యాప్తి చేసింది ఎవరనే దానిపై రెండు అగ్రదేశాల మధ్య మాటల యుద్ధం వారం కిందటే మొదలైంది. అమెరికా సైన్యమే చైనాకు వైరస్ను తీసుకొచ్చిందని చైనా విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ గత వారం ఆరోపించారుదీంతో చైనా అధికారితో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియో ఫోన్లో మాట్లాడారు. ఇలా ఆరోపణలు చేసుకోవడానికి ఇది టైం కాదని, కలిసి వైరస్పై పోరాడదామని చెప్పారు.
ఆగస్టు వరకు ఉండొచ్చేమో
కరోనా ప్రభావం ఆగస్టు వరకు ఉండొచ్చేమోనని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైరస్ సోకిన వాళ్ల నుంచి ఇతరులకు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని.. 10 మంది కన్నా ఎక్కువగా గుమికూడొద్దని జనాన్ని కోరారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. బార్లు, రెస్టారెంట్లలో తినొద్దన్నారు. ఇలాంటివి పాటిస్తే వైరస్ను జయిస్తామన్నారు.
ఎలక్షన్స్ వాయిదా అనవసరం: ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. వైరస్ ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేయడం మంచి ఐడియా కాదన్నారు. మరోవైపు మంగళవారం జరగాల్సిన ఓటింగ్ను అరిజోనా, ఇల్లినాయిస్, ప్లోరిడా వాయిదా వేశాయి. ఓహియో గవర్నర్ కూడా ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. వైరస్ వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.