తర్నం బ్రిడ్జిపై రాజకీయం .. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే రామన్న మధ్య మాటలు యుద్ధం

తర్నం బ్రిడ్జిపై రాజకీయం .. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే రామన్న మధ్య మాటలు యుద్ధం
  • వర్షాకాలం సమయంలో కూల్చివేయడంపై ప్రశ్నించిన జోగు
  • చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న తాత్కాలిక వంతెన 
  • మొన్న బ్రిడ్జి దాటుతుండగా ఒకరి గల్లంతు 
  • హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం

ఆదిలాబాద్, వెలుగు:  జైనథ్ మండలంలోని తర్నం వాగుపై ఉన్న బ్రిడ్జిపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇటీవల పాత బ్రిడ్జిని కూల్చి తాత్కాలికంగా నిర్మించిన లోలెవల్ వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గతేడాది ఈ బ్రిడ్జిని రూ. 4.50 కోట్లతో నిర్మించగా చిన్నపాటి వర్షానికే మునిగిపోతోంది. ఇదిలాఉండగా నాలుగు రోజుల క్రితం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు అనే యువకుడు బ్రిడ్జి దాటుతుండగా వరదలో కొట్టుకుపోయాడు. దీంతో యువకుడి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. వానాకాలం వస్తున్న నేపథ్యంలో రత్నం బ్రిడ్జిని కూల్చివేయడంపై ప్రశ్నించారు.

ఆది నుంచి బ్రిడ్జిపై వివాదాలే..

ఆదిలాబాద్–మహారాష్ట్ర మధ్య ఉన్న జాతీయ రహదారిపై ఉన్న తర్నం వాగు బ్రిడ్జి మీద నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగేవి. అయితే 2023 ఫిబ్రవరిలో పగుళ్లు వచ్చి కుంగిపోయింది. దీంతో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాడు ఆ బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. 2018లోనే బ్రిడ్జిని తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బ్రిడ్జిని నిర్మించడం లేదంటూ బీఆర్ఎస్ లీడర్లు ఎదురుదాడి చేశారు. 

కుంగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రత్యామ్నాయ మార్గం కోసం ఇతర గ్రామాల నుంచి రోడ్డు విస్తరణ కోసం కేంద్రం రూ.44 కోట్లు మంజూరు చేయగా రోడ్డు వేశారు. కుంగిపోయిన బ్రిడ్జి పక్కనే రూ.4 కోట్లతో తాత్కాలికంగా వంతెన నిర్మించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం తాత్కాలిక లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడం, దత్తు అనే యువకుడు కొట్టుకుపోవడంతో మరోసారి తర్నం బ్రిడ్జి వివాదం తెరపైకి వచ్చింది. 

బ్రిడ్జి నిర్మాణం జాప్యంతోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి

తర్నం బ్రిడ్జి నిర్మాణం జాప్యంతోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పాత బ్రిడ్జిని వానాకాలం సమయంలో కూల్చివేసే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పక్కనున్న లోలెవల్ వంతెనపై ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. పాత బ్రిడ్జి కుంగిపోయిన సమయంలో రభస చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. బ్రిడ్జి కూల్చివేత విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని.. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ రాజర్షి షాను కలిసి ఫిర్యాదు చేశారు. 

కమీషన్లు తీసుకునే అలవాటు జోగు రామన్నది

తర్నం బ్రిడ్జి అంశంపై జోగు రామన్న చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్  కౌంటర్ ఇచ్చారు. మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునే అలవాటు జోగు రామన్నకే ఉందని ఆరోపించారు. తర్నం బ్రిడ్జిపై నుంచి కొట్టుకుపోయిన దత్తు కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై రామన్న అవాస్తవాలు మాట్లాడారన్నారు. జోగు రామన్న ఎమ్మెల్యే ఉన్న సమయంలోనే తర్నం బ్రిడ్జి కూలిపోయినప్పుడు తాత్కాలిక వంతెన నిర్మించేందుకు చాతకాలేదని 
మండిపడ్డారు.   

బ్రిడ్జి పూర్తయ్యేదెప్పుడు?

బోరజ్ నుంచి మహారాష్ట్రాలోని రాజురా 353బి జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలో బేల నుంచి బోరజ్ వరకు 33 కిలోమీటర్ల పరిధిలో పనులు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కల్వర్టులతో పాటు తర్నం వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ. 494 కోట్లతో చేపట్టిన ఈ రోడ్డు పనుల్లో తర్నం బ్రిడ్జిని రూ.25 కోట్లతో నిర్మించాలి. గతేడాది క్రితమే పనులు ప్రారంభించగా.. తర్నం బ్రిడ్జి పనులు మాత్రం చేపట్టలేదు. 

వర్షాకాలంలో అక్కడి లోలెవల్ వంతెన మునిగిపోతుంది. దీంతో వర్షాల సమయంలో ఈ రోడ్డు గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లోలెవల్​వంతెనపై వరద ప్రవాహం కారణంగా కుంగిపోయిన పాత బ్రిడ్జిపై నుంచే ప్రమాదకరంగా బైక్ లపై రాకపోకలు సాగించేవారు. అయితే వానాకాలంలో నిర్మాణ పనులు చేపట్టే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ సమయంలో పాత బ్రిడ్జిని  కూల్చివేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.