
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశమంతా స్పీడ్గా అంటుకుపోతోంది. రోజురోజుకూ మరింత విరుచుకుపడుతోంది. వారం వారం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. సోమవారానికి దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటింది. ఒక్కరోజే 4,641 కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1,00,340కు చేరుకుంది. గత 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే 2,033 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,436 మంది కోలుకున్నారు. 130 మంది మృతిచెందారు.
మహారాష్ట్రలోనే ఎక్కువగా..
దేశంలోని మొత్తం కేసుల్లో మూడో వంతు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 35,086 మంది వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత తమిళనాడులో 11,760 మంది, గుజరాత్లో 11,746 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా వైరస్ నుంచి ఎక్కువగా కోలుకున్నదీ మహారాష్ట్రలోనే. దేశంలో మొత్తం 39,231 మంది కోలుకుంటే మహారాష్ట్రలో 8,437 మంది క్యూరయ్యారు. తర్వాత గుజరాత్లో 4,804 మంది, తమిళనాడులో 4,406 మంది కోలుకున్నారు. కరోనాతో దేశవ్యాప్తంగా 3,155 మంది చనిపోగా ఒక్క మహారాష్ట్రలోనే 1,249 మంది మృతి చెందారు. దేశంలోని మెయిన్ సిటీల లెక్కన చూస్కుంటే ఒక్క ముంబైలోనే 20 వేల మందికి పైగా వైరస్ సోకింది. తర్వాత అహ్మదాబాద్లో 8,600కి పైగా, చెన్నైలో 7,100కు పైగా కేసులు రికార్డయ్యాయి.
ప్రపంచంలో 48.5 లక్షల కేసులు
ప్రపంచవ్యాప్తంగా కేసులు అర కోటికి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 48 లక్షల 50 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 3 లక్షల 18 వేల మందికి పైగా చనిపోయారు. 18 లక్షల మందికి పైగా కోలుకున్నారు. మొత్తం కేసుల్లో మూడో వంతు అమెరికాలోనే నమోదయ్యాయి. 15 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులోనూ 3 లక్షల 59 వేలకు పైగా ఒక్క న్యూయార్క్లోనే రికార్డయ్యాయి. అమెరికాలో కొవిడ్ 19 మరణాలు 91 వేలు దాటాయి.