
న్యూయార్క్: అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు శుక్రవారం నాటికి 277,161 కు చేరాయి. మరణాల సంఖ్య 7,392కి చేరింది. దేశంలో 12,283 మంది కోలుకున్నారు. న్యూయార్క్ లో అత్యధికంగా 93,053 కేసులు, 2,538 మరణాలు నమోదయ్యాయి. న్యూయార్క్ లో వైద్య రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. ఈ ఒక్కసిటీలోనే 1500 మంది బలైపోయారు. పూడ్చేందుకు స్థలం లేక 185 డెడ్ బాడీలను ఇంకా మార్చురిల్లోనే ఉంచారు. న్యూజెర్సీ, కనెక్టికట్తోపాటు న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఏరియాల్లోనే చైనా కంటే చాలా ఎక్కువగా 1.20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మరణాలు 3 వేలు దాటాయి. ఇదిలా ఉంటే.. కరోనా ఎఫెక్ట్తో అమెరికాలో ఎన్నడూ లేనంతగా గత రెండు వారాల్లోనే కోటి మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. నిత్యావసర సరుకులకూ తీవ్ర కొరత ఏర్పడుతోంది.
ఇంట్లనే ఉండండి: ట్రంప్
‘‘వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో విజయం సాధించాలంటే అందరూ ఇండ్లలోనే ఉండాలి. వచ్చే నాలుగు వారాల పాటు(ఏప్రిల్ 30 వరకు) సోషల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్ ను పాటించాలి’’ అని అమెరికన్లకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. గురువారం వైట్ హౌజ్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వైరస్ నుంచి రక్షణ కోసం కొత్త మార్గాలను, మందులు, టీకాలను వెదుకుతున్నామని, ఇప్పటికే ఈ దిశగా పురోగతి సాధించామన్నారు. అమెరికాలో రోజూ లక్ష మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.