
వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేత
సొంతూర్లకు పోతున్న సిటీజనం
కరోనా దెబ్బకు అల్లాడుతున్న
యూరప్, అమెరికా
యూఎస్లో ఒక్కరోజే
1,970మంది మృతి
స్పెయిన్, ఇటలీ,ఫ్రాన్స్లలో
లక్ష దాటిన కేసులు
10 వేలకుపైగా మరణాలు
న్యూఢిల్లీ: కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. వైరస్ తొలి కేసు
నమోదైన వుహాన్లో లాక్డౌన్ను బుధవారం పూర్తిగా ఎత్తేశారు. 76 రోజుల తర్వాత ఆంక్షలు తొలగించారు. కానీ అమెరికా, యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలో కేసులు 4 లక్షలు దాటగా మరణాలు 12 వేలు నమోదయ్యాయి. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్లో కేసులు లక్షలు దాటేశాయి. మరణాలూ 10 వేలు దాటిపోయాయి.
సొంతూర్లకు వుహాన్ జనం
కరోనాకు పుట్టునిల్లయిన చైనాలోని వుహాన్లో పరిస్థితి కంట్రోల్లోకి రావడంతో లాక్డౌన్ ఎత్తేశారు.
దీంతో వేలాది మంది సొంతూర్లకు వెళ్తున్నారు. మంగళవారం చైనాలో 62 కేసులు నమోదవగా ఇద్దరు మృతి చెందారు.
ఫ్రాన్స్ పరేషాన్
ఫ్రాన్స్లో కరోనా కేసులు లక్ష దాటాయి. మరణాలూ 10 వేలు దాటి పోయాయి. మంగళవారమైతే కొత్తగా 11 వేల కేసులు నమోదవగా 1,400 మందికి పైగా చనిపోయారు. ఆ దేశంలో ఒక్క రోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి.
స్పెయిన్లో శవాల కుప్పలు
స్పెయిన్లో 5 రోజుల తర్వాత మరణాలు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 743 మంది
మృతి చెందారు. గత 15 రోజులుగా రోజూ 500మందిపైనే చనిపోతున్నారు. రోజువారీ కొత్త కేసులూ 5 వేలు దాటుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు లక్షన్నర వేలకు దగ్గర్లో ఉన్నాయి. మరణాలు 15 వేలకు చేరువయ్యాయి.
ఇటలీ ఆగమాగం
ఇటలీ కూడా కరోనా దెబ్బకు అతలాకుతలమవుతోంది. ఇప్పటికే కేసులు లక్షా 35 వేలు దాటాయి. కరోనా మరణాలు 17 వేలు దాటిపోయాయి. మార్చి 14 నుంచి ప్రతి రోజూ 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మార్చి 20 నుంచి రోజూ 500 మందికి పైగా చనిపోతూనేఉన్నారు.