కరోనా ఎఫెక్ట్: పార్కులు, పులుల అభయారణ్యాలు మూసివేత

కరోనా ఎఫెక్ట్: పార్కులు, పులుల అభయారణ్యాలు మూసివేత

హైదరాబాద్: కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతున్న నేపధ్యంలో పార్కులు, ఉద్యానవనాలు, పులుల అభయారణ్యాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా విస్తరణ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూ పార్క్ లు, పులుల అభయారణ్యంలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు స్పందించి అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
మంత్రి సూచనల మేరకు
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్ లను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లు, రక్షిత అటవీ ప్రాంతాలను మూసివేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. వీటిల్లో సందర్శకులకు అనుమతి నిలిపివేశారు.అలాగే  హైదరాబాద్ కేబీఆర్ (KBR) పార్క్ ను కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం మూసివేయనున్నట్లు పీసీసీఎఫ్ తెలిపారు.