న్యూఢిల్లీ: కరోనా సెగ కార్పొరేట్ హాస్పిటల్స్కూ తగులుతోంది. రోగులు రావడం పూర్తిగా తగ్గిపోయిందని, హాస్పిటల్స్ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత పరిస్థితులలో లాభాల గురించి ఆలోచించడంలేదని, వీటిని నడపడమే కష్టంగా మారిందని పేర్కొంటున్నాయి. ఒక కరోనా హాస్పిటల్ను నడపడానికి అధిక మొత్తంలో ఖర్చవుతుందని నారాయణ హృదయాలయ చైర్మన్ దేవి శెట్టి అన్నారు. ప్రైవేట్ ప్రొటక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) స్టాక్స్ను ఒక నెల పాటు మెయింటైన్ చేయాలంటేనే కోట్ల రూపాయల్లో ఖర్చవుతుందని చెప్పారు. ‘‘డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు ఒక వారం లేదా రెండు రోజులు మాత్రమే పనిచేయగలరు. తర్వాత వీరిని క్వారంటైన్లో ఉంచాల్సి వస్తుంది. వీరు ఇంటికి వెళ్లలేరు.
హోటల్స్లో ఉంచాల్సి ఉంటుంది. హోటల్ ఖర్చులను హాస్పిటల్సే చెల్లించాలి” అని శెట్టీ అన్నారు. వేరువేరు స్కీమ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉండిపోయాయని తెలిపారు. ఒక ఐసీయూ పేషెంట్ను చూడడానికి రోజుకి సగటున ఐదు పీపీఈలను వాడాల్సి ఉంటుందని చెప్పారు. వీటికి తోడు హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కు కరోనా టెస్ట్లు చేయాల్సి ఉంటుందని, వారికి కరోనా ఉంటుందనే అనుమానంతో టెస్ట్లు చేసే డాక్టర్లు కూడా పీపీఈని వేసుకోవాలన్నారు. గత నెల రోజులలో కేవలం స్టాఫ్ ఖర్చులే రెండింతలయ్యాయని చెప్పారు. కరోనా పేషెంట్లను చూస్తున్న డాక్టర్లు, నర్సులు నెలలో సగం రోజులు క్వారంటైన్లోనే ఉంటారని అన్నారు.
ప్రస్తుం ఒక కరోనా పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో 12 రోజులుంటే రూ. 5 లక్షలు ఖర్చవుతుంది.. దేశం మొత్తం మీద చూస్తే యావరేజిగా రోజుకి రూ.40,000–50,000 ఖర్చవుతుంది. పేషెంట్ను ఐసీయూకి షిఫ్ట్ చేస్తే ఈ ఖర్చు మరింత పెరుగుతుందని శెట్టి వివరించారు.
హెల్త్ కేర్ ఇండస్ట్రీ సమస్యలను పట్టించుకోవాలి. కరోనాకు ముందు కూడా ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. కరోనా దెబ్బతో హాస్పిటల్స్కు పేషెంట్లు రావడం తగ్గింది. డయగ్నోస్టిక్ టెస్టింగ్, కొన్ని సర్జరీలు తగ్గిపోయాయి. ఇంటర్నేషనల్ పేషెంట్స్ విభాగం పడిపోవడంతో హాస్పిటల్స్ క్యాష్ ఫ్లో పడిపోయింది. వీటికితోడు కరోనా వలన హాస్పిటల్స్, లేబరేటరీస్ ఖర్చులు మరింత పెరిగాయి. – అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీతారెడ్డి.