- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
- ఈ నెల 10 వరకు ఆంక్షలు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వ్యాపిస్తున్నందున కరోనా రూల్స్ మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. దీంతో కరోనా ఆంక్షలను ఈ నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం బీఆర్కే భవన్లో కరోనా సిచ్చేవేషన్, ఒమిక్రాన్ వ్యాప్తిపై ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ రివ్యూ చేశారు. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సాంస్కృతిక ఉత్సవాలకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. షాపింగ్ మాల్స్, దుకాణాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో సోషల్ డిస్టెన్స్ కంపల్సరీగా పాటించాలని ఆదేశించారు. మాస్క్ ఇంప్లిమెంటేషన్ సరిగా అమలు కాకపోవడంపై ఫైర్ అయ్యారు. . పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోని వారికి రూ. వెయ్యి ఫైన్ వెయ్యాలని ఆదేశించారు. ఆఫీసులు, స్కూళ్లు, ఇతర సంస్థల్లో శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్రటరీలు సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస్రావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, హెల్త్ ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి
పాల్గొన్నారు.
మరో 12 మందికి ఒమిక్రాన్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్క రోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి హైదరాబాద్ వారిలో ముగ్గురికి, నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన 9 మందికి ఈ వైరస్ సోకిందని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. ఇప్పటివరకు 27 మంది కోలుకోగా, మరో 62 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి శనివారం రాష్ట్రానికి వచ్చిన 123 మందిలో 10 మందికి పాజిటివ్ వచ్చిందని, శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామన్నారు.
317 కేసులు.. ఇద్దరు మృతి
రాష్ట్రంలో మరో 317 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. శనివారం 28,886 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్లో 217 మందికి, జిల్లాల్లో వంద మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. కరోనాతో శనివారం ఇద్దరు చనిపోయారని, మృతుల సంఖ్య 4,029కి పెరిగిందని తెలిపారు.