- కొత్త కేసులన్నీ మూడు రాష్ట్రాల్లోనే
- 70వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,216మంది కరోనా బారినపడ్డారు. వైరస్ కారణంగా మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 8,148మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108కు చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 2.73శాతానికి పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటివరకు 1,96,00,42,768 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.
కొత్త కేసులన్నీ ఈ మూడు రాష్ట్రాల నుంచే
- దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలోనే ఉన్నాయి. కేరళలో 3వేల 253 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 1797 కేసులు, ఒక్క ముంబై మహానగరంలోనే 2 వేల 255 కేసులు నమోదయ్యాయి.
- గడచిన 24 గంటల్లో కరోనా సోకిన వారిలో 23 మంది కోలుకోలేక చనిపోగా... ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 5 లక్షల 24వేల 840కు చేరింది.
- 8వేల 148 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 26 లక్షలు దాటింది. మొత్తం రికవరీ రేటు 98.63శాతంగా నమోదు అయింది.
- తాజాగా నమోదవుతున్న కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజా బులెటిన్ ప్రకారం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 68 వేల 108 (0.16శాతం) గా ఉంది.
- గడచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 14 కోట్ల 99 లక్షల 824 మంది వ్యాక్సిన్లు వేయించుకోగా.. ఇప్పటి వరకు డోసుల పంపిణీ 196 కోట్లు దాటాయి.