హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు పెరిగిపోతోంది. చేస్తున్న టెస్టులు, వస్తున్న పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. ప్రతి 16 టెస్టుల్లో ఒకటి పాజిటివ్గా తేలుతోంది. ఈ నెల ఒకటో తేదీ నాటికి పాజిటివ్ రేటు 5.3 శాతం ఉంటే, 14 నాటికి 6.46 శాతానికి చేరింది. మహారాష్ర్టలో ఎక్కువగా 11.2 శాతం మందికి పాజిటివ్ వస్తే రాష్ట్రంలో అది 6.1 శాతంగా ఉంది. 7.9 శాతంతో గుజరాత్ రెండో స్థానంలో ఉండగా, 7.13 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. దేశ సగటు 4 శాతంగా ఉంది. ఈ నెల ఒకటి నుంచి 8 వరకు రాష్ట్రంలో 94 కేసులు నమోదవగా, ఆ తర్వాత 8 రోజుల్లోనే 377 కేసులు రికార్డయ్యాయి. దీంతో పాజిటివ్ రేటు ఒక శాతానికిపైగా పెరిగింది. ఈ నెల 16 నాటికి రాష్ర్టంలో 23,388 టెస్టులు చేస్తే, అందులో 6.46% మందికి పాజిటివ్ వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ప్రకటించారు. ప్రతి 16 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోందని, 15 మందికి నెగెటివ్ అని చెప్పారు. 15,203 మంది మగవాళ్లకు టెస్టులు చేయిస్తే అందులో 947(6.22శాతం) మందికి, 8,185 మంది మహిళలకు టెస్టులు చేయిస్తే, అందులో 566 (6.9%) మందికి పాజిటివ్ వచ్చిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు
రోజుకు 308 టెస్టులే
రాష్ర్టంలో మార్చి 2న కరోనా ఫస్ట్ కేసు నమోదైంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 1,551కు చేరింది. ఈ 76 రోజుల్లో సగటున రోజూ 308 టెస్టులు మాత్రమే చేయడం గమనార్హం. తెలంగాణ సహా దేశంలోని 17 రాష్ర్టాల్లో ఐదొందల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోకెల్లా మన దగ్గరే తక్కువ టెస్టులు చేశారు. శనివారం నాటికి తమిళనాడులో అత్యధికంగా 3,13,639 టెస్టులు చేయగా, తెలంగాణలో టెస్టుల సంఖ్య 24 వేలు కూడా దాటలేదు. మహారాష్ర్ట, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 2.2 లక్షల కంటే ఎక్కువ టెస్టులు చేయించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాల్లో 1.3 లక్షల కంటే ఎక్కువ టెస్టులు చేశారు. మధ్యప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, జమ్ముకాశ్మీర్, హర్యానాల్లో 75 వేల కన్నా ఎక్కువ టెస్టులు చేయగా, పంజాబ్, బీహార్, కేరళలో 45 వేలకుపైనే టెస్టులు చేశారు.