ఫాక్స్కాన్ కంపెనీలో 20వేల మంది ఉద్యోగులకు వైరస్
అందరినీ లోపలే ఉంచేసిన యాజమాన్యం
హాంకాంగ్: ‘జీరో కోవిడ్’ స్ట్రాటజీ పేరుతో చైనా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు చాలా దారుణంగా ఉంటున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. హెనన్ ప్రావిన్స్ జెంగ్ఝౌలోని ఐఫోన్ తయారీ కంపెనీలో క్వారంటైన్ నిబంధనలు తట్టుకోలేక ఉద్యోగులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చైనాలోనే అతిపెద్ద కంపెనీ అయిన ఫాక్స్కాన్ జెంగ్ఝౌలో ఉంది.
ఇక్కడ యాపిల్ ఫోన్లు అసెంబుల్ చేస్తుంటారు. ఐఫోన్ 14 డివైజ్ విడిభాగాలు కూడా ఉంటాయి. మొత్తం 3,50,000 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారు. కాగా, 20వేల మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉద్యోగులు అందరినీ కంపెనీ లోపలే క్వారంటైన్లో పెట్టింది.
కాలినడకన వందల కిలో మీటర్లు
ఫ్యాక్టరీలో సరైన సౌలతులు, తినడానికి తిండి లేకపోవడంతో ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. వైరస్ బారిన పడ్డవారికి, అనారోగ్యంపాలైన వారికి ఫ్యాక్టరీ తలుపులు మూసేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగులు అందరినీ గదులకే పరిమితంచేస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ సామాన్లు తీసుకొని ఫ్యాక్టరీ ఫెన్సింగ్పై నుంచి దూకి, వందల కిలోమీటర్ల దూరం ఉన్న ఇండ్లకు కాలినడకన వెళ్లిపోతున్నారు. క్వారంటైన్లోనే ఉన్న కరోనా బాధితులకు మాత్రం ఫ్యాక్టరీకి దగ్గర్లోని గ్రామ ప్రజలు ఆహారం, డ్రింక్స్ ఇస్తున్నారు.