- జిల్లాలో 125 ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు
- టీయూలో 20 మంది స్టూడెంట్లకు పాజిటివ్
నిజామాబాద్, వెలుగు: ఇందూరులో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. సెకండ్ వేవ్లో వణికించిన ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ తాజాగా మరోసారి ఉమ్మడి జిల్లాలో వ్యాపిస్తూ దడపుటిస్తోంది. గతంలో కరోనా టైంలో రాష్ట్రాన్ని అన్లాక్ చేయడంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన జనం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రాకపోకలు సాగించారు. అలా మహారాష్ట్ర నుంచి మొదటగా ఉమ్మడి జిల్లాలో వైరస్ అంటుకుంది. మళ్లీ మహారాష్ట్ర నుంచి కేసులు వస్తున్నాయి.
పెరుగుతున్న కేసులు..
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం బీఏ 2.75, బీఏ 2.76 వేరియెంట్ కేసులు నమోదవుతున్నాయి. గత 10 రోజల్లో 125 కరోనా పాజిటివ్ వచ్చాయి. శుక్రవారం కోటగిరి మండలం కొడిచర్లలో యూపీఎస్ ఐదుగురు స్టూడెంట్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 4 రోజుల కింద టీయూలో 17 మంది స్టూడెంట్లకు కరోనా సోకగా.. రెండు రోజుల కింద మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వర్సిటీలో వరుసగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పేరేంట్స్ ఆందోళనకు గురవుతున్నారు.
కంప్లీట్ కాని వ్యాక్సినేషన్..
జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ స్లోగా సాగింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 24.50 లక్షల జనాభా ఉండగా ఫస్ట్ , సెకండ్ డోస్ 19 లక్షల మంది తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 11.44 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 7.55 లక్షల మంది రెండు డోస్ల టీకా తీసుకున్నారు. బూస్టర్ డోస్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. శుక్రవారం వరకు 38,520 మంది ప్రికాషనరీ టీకా తీసుకున్నారు.
కొడిచర్ల స్కూల్లో కరోనా కలకలం
కోటగిరి, వెలుగు: మండలంలోని కొడిచర్ల యూపీఎస్ స్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. స్కూల్లో పనిచేసే ఓ టీచర్కు ఒల్లు నొప్పులు రావడంతో గురువారం రుద్రూర్లో టెస్ట్ చేసుకోగా అతడికి పాజిటివ్ అని తేలింది. విషయాన్ని కోటగిరి ఎంఈవో అత్తారుద్దీన్ దృష్టికి తీసుకెళ్లి ఆ టీచర్ హోం క్వారంటైన్లోకి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఎంఈవో పొతంగల్ పీహెచ్సీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శుక్రవారం స్కూల్లో స్టూడెంట్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. 101 మంది పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్టూడెంట్లతో పాటు గ్రామంలోని కొందరు పేరెంట్స్కు కరోనా టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారికి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
కొత్త వేరియెంట్తో ముప్పు
బీఏ 2.75, బీఏ 2.76 వేరియెంట్ వ్యాప్తి వేగంగా ఉంది. కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి. రెండు డోస్ల టీకా తీసుకున్నా వారు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిడ్ రూల్స్ కంపల్సరీ పాటించాలి.
- డాక్టర్ మాదాల కిరణ్, జీజీహెచ్
వ్యాప్తి చెందకుండా చర్యలు
జిల్లాలో ఒమిక్రాన్ వేరియేంట్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాం. అన్లాక్ ఉన్నా కోవిడ్ రూల్స్ తప్పనిసరి పాటించాలి. మహారాష్ట్ర సరిహద్దుల్లో వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఇంటింటా సర్వే ప్రారంభించాం.
- సుదర్శనం, డీఎంహెచ్వో