- ఇంట్లోనే ఉండి మెడిసిన్వాడుతున్న గ్రేటర్ జనం
- ఫీవర్ సర్వేలో వేలాది అనుమానితుల గుర్తింపు
- సెంటర్లలో కంటే ఇండ్ల వద్దే అధికంగా ఐసోలేషన్ కిట్ల పంపిణీ
హైదరాబాద్, వెలుగు: కొవిడ్ సింప్టమ్స్ అనిపించగానే టెస్టింగ్ సెంటర్లకు పరిగెత్తుతున్న వారికంటే ఇండ్లలోనే ఉండి మెడిసిన్ వాడుతున్నవారు ఎక్కువగా ఉన్నారని ఫీవర్ సర్వేలో తెలుస్తోంది. గతంలో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం వంటి లక్షణాలు కనిపించగానే ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్లకు జనాలు పరుగులు పెట్టారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సింప్టమ్స్ ఉన్నా ఇంట్లోనే ఉండి మెడిసిన్వాడుతున్నారు. గ్రేటర్ పరిధిలో గత ఆరు రోజుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది 13,500 మందికి హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. లక్షణాలు ఉన్నవారికి ఇంటి వద్దే టెస్ట్ చేసి కిట్ఇస్తున్నారు. ఇలా 6 రోజుల్లో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చిన వారు 7 వేల మంది ఉన్నారు.
తీవ్రంగా ఉంటే ట్రీట్మెంట్కి..
ఫీవర్ సర్వేలో భాగంగా సింప్టమాటిక్ పేషెంట్లను గుర్తించి వారికి హోం ఐసోలేషన్ కిట్లను అందించడంతో పాటు తీవ్రమైన లక్షణాలున్నవారికి హెల్త్ సిబ్బంది అక్కడికక్కడే ర్యాపిడ్ టెస్టులు చేస్తోంది. శాంపిల్స్ కలెక్ట్ చేసి పేషెంట్లను ట్రీట్మెంట్కు పంపిస్తున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు కూడా అధికంగానే ఉంటున్నారని సర్వేలో తెలుస్తోంది.
ఐసోలేషన్ కిట్ వాడాలి
జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు హోం ఐసోలేషన్ కిట్ తీసుకొని వాడండి. వాడినా కూడా తగ్గకుంటే కరోనా టెస్టు చేయించుకోండి. టెస్టు చేయించుకుంటే కుటుంబ సభ్యులకు కొవిడ్ సోకే ప్రమాదం తప్పుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇంట్లోని అందరూ సిక్ అయ్యే చాన్స్ ఉంటుంది.
- డాక్టర్ వెంకటి, డీఎంహెచ్వో, హైదరాబాద్ జిల్లా
టెస్ట్ కి పోలేదు..
మా ఫ్యామిలీలో జ్వరం, జలుబుతో సిక్ అవడం చాలా తక్కువగా ఉండేది. కానీ శనివారం నుంచి తీవ్రమైన జ్వరం, జలుబు, తలనొప్పి, బాడీ పెయిన్స్ మొదలయ్యాయి. కొవిడ్ సింప్టమ్స్లా అనిపించడంతో డాక్టర్ల సూచనలతో వారం రోజుల కోర్సు వాడుతున్నాం. కరోనా టెస్టుకు వెళ్లలేదు. ప్రస్తుతం హెల్త్ కొంచెం బెటర్ అయ్యింది.
- సంధ్య, పేషెంట్, ఉప్పల్