
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా జిల్లాల్లో ఉన్న అన్ని హాస్పిటళ్లలో పూర్తి స్థాయిలో కరోనా ట్రీట్మెంట్ అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైరస్ లక్షణాలు తక్కువగా ఉన్నవారికి జిల్లా దవాఖాన్లలోనే ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. ఎసింప్టమాటిక్ పేషెంట్లందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచి అబ్జర్వ్ చేయాలన్నారు. అన్ని టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో సోమవారం మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దవాఖాన్లకు ఏది అవసరమైనా ఒక్క రోజులోనే సమకూరుస్తామని, పేషెంట్లకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని వారికి ఆయన సూచించారు. సూపరింటెండెంట్లు అందరూ జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దవాఖాన క్వార్టర్స్లోనే ఉంటూ సేవలందిస్తున్న మహబూబ్నగర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ను మంత్రి ఈటల అభినందించారు. ఇలాంటి టైంలో అందరూ మానవత్వంతో మెలగాలని కోరారు.