హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ సోమవారం హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఆయన ఫస్ట్ ఫేజ్లోనే టీకా తీసుకునేందుకు ముందుకొచ్చారు. కానీ రాజకీయ నాయకులెవరూ వ్యాక్సిన్ తీసుకోవద్దన్న ప్రధాని మోడీ సూచన మేరకు ఆగిపోయారు. ఇప్పుడు 45 ఏండ్లపైన వయసు, కోమార్బిడిటీస్ ఉన్నవారి కేటగిరీలో ఈటల వ్యాక్సిన్ తీసుకోనున్నారు.
హైదరాబాద్, వెలుగు: సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్కు రంగం సిద్ధమైంది. 48 ప్రభుత్వ, 45 ప్రైవేట్ హాస్పిటళ్లలో సోమవారం ఉదయం పదిన్నరకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించనున్నారు. మొదటి రోజు ఒక్కో సెంటర్లో రెండొందల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. పొలిటికల్ లీడర్లు, సెలబ్రెటీలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సామాన్యులకు కూడా తొలి రోజు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు కొవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్లో రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. ఫస్ట్ డే కోసం ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్ల వివరాలు, వ్యాక్సినేషన్ తేదీలు, టైమ్ స్లాట్ల వంటివన్నీ పోర్టల్, యాప్లో హెల్త్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసింది. మన రాష్ర్టంలో తొలి వారం రోజులు ఆన్లైన్లో, అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కనీసం ఒక రోజు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. రేపటి స్లాట్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. తొలి రోజు మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు.
స్లాట్ డేట్, టైం మార్చుకోవచ్చు
ఫస్ట్ డోసు కోసం స్లాట్ బుక్ చేసుకునే టైంలోనే.. సెకండ్ డోసు కోసం కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు వరకూ ఎప్పుడైనా సెకండ్ డోసు కోసం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా.. ఫస్ట్ డోసు నుంచి 29వ రోజు సేమ్ సెంటర్లో స్లాట్ బుక్ అవుతుంది. సెకండ్ డోసు కోసం స్లాట్ బుక్ చేసుకున్న రోజు వెళ్లలేకపోతే.. మరో రోజు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇందుకోసం అక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ ఇస్తారు. ఫస్ట్ డోసు కోసం బుక్ చేసుకున్న స్లాట్ను ఎడిట్ చేసుకోవడానికి, రీషెడ్యూల్ చేసుకోవడానికి చాన్స్ ఉంటుంది. సెకండ్ డోసు స్లాట్ను క్యాన్సిల్ లేదా ఎడిట్ చేసుకోలేరు.
గుర్తింపు కార్డులు ఇవే
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏడు రకాల గుర్తింపు కార్డులు.. ఆధార్, ఓటర్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫొటోగ్రాఫ్, పాన్ కార్డు, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్ లను అనుమతిస్తారు. వీటిలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో కార్డులో ఉన్నట్టుగానే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి. అదే కార్డును వ్యాక్సినేషన్ సెంటర్కు తీసుకెళ్లాలి.
ఆన్ లైన్లో సర్టిఫికెట్ ఫార్మాట్
45 నుంచి 59 ఏండ్ల మధ్య వయసుండి.. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్లు, తమకు జబ్బు ఉన్నట్టు డాక్టర్ వద్ద సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్కు సంబంధించిన ఫార్మాట్ను సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. కొవిన్ పోర్టల్లో అది అందుబాటులో ఉంది. దీన్ని ప్రింట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. వాళ్లు సంతకం, స్టాంప్ వేసి ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్ కనీసం ఎంబీబీఎస్ చేసి ఉంటే సరిపోతుంది. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఉండే డాక్టర్లు కూడా ఈ సర్టిఫికెట్ ఇస్తారు. తమకు జబ్బు ఉన్నట్టుగా గతంలో చేయించుకున్న టెస్టు రిపోర్టులు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ వంటివి తీసుకెళ్లి వారికి చూపించాలి. డాక్టర్లు వాటిని పరిశీలించి సర్టిఫికెట్ ఇస్తారు.
ఎప్పటికప్పుడు చెల్లిస్తే చాలు
ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ధర రూ.250గా నిర్ణయించారు. ఒకేసారి రెండు డోసుల డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డోసు తీసుకునేటప్పుడు ఫస్ట్ డోసు డబ్బులు, సెకండ్ డోసు టైమ్లో దాని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
పోలింగ్ బూత్ తరహాలో వ్యాక్సినేషన్ సెంటర్లు
కరోనా వ్యాక్సినేషన్ ఎలక్షన్ల తరహాలోనే జరగనుంది. ఓటర్ లిస్టులో పేరుంటేనే ఓటు వేయనిచ్చినట్టుగా, ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్ వేయనున్నారు. గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్ చేసుకున్న మెసేజ్ లేదా కన్ఫర్మేషన్ స్లిప్ చూపిస్తేనే వ్యాక్సినేషన్ సెంటర్లోకి వెళ్లనిస్తారు. రిజిస్ట్రేషన్ టైంలో నమోదు చేసిన ఐడీ కార్డునే సెంటర్కు తీసుకెళ్లాలి. వ్యాక్సినేషన్ ఆఫీసర్గా ఉన్న సిబ్బందికి ఆ కార్డు చూపించి, వారు సూచించిన చోట వెయిట్ చేయాలి. తర్వాత మరో ఆఫీసర్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వచ్చిన మెసేజీ, గుర్తింపు కార్డు చూపాలి. వారు కొవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ వివరాలు వెరిఫై చేసి.. వెయిటింగ్ హాల్కు పంపిస్తారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరికి వ్యాక్సిన్ వేస్తూ.. ఎడమ చేతి బొటన వేలుకు సిరా చుక్క పెడతారు. తర్వాత అరగంట పాటు అక్కడే వెయిట్ చేయాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్కు తెలియజేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదీ..
కొవిన్ పోర్టల్(https://selfregistra tion.cowin.gov.in/) లేదా ఆరోగ్యసేతు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పోర్టల్ లేదా యాప్లోకి ఎంటర్ అయ్యాక ‘సెల్ఫ్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయగానే ఓ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
ఫోన్ నంబర్ తో అందులో లాగిన్ కావాలి.
అక్కడ ఉండే ఏడు రకాల ఐడెంటిటీ కార్డు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి.
ఆ కార్డు నంబర్, కార్డుపై ఉన్న విధంగా పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
ఒకవేళ ఆధార్ యూజ్ చేస్తే.. అథెంటికేషన్ కోసం ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆధార్ కాకుండా.. వేరే ఐడీ ఎంచుకుంటే అథెంటికేషన్ అవసరం ఉండదు.
ఒకవేళ 45 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వాళ్లయితే.. తమకు ఉన్న జబ్బు వివరాలు ఎంటర్ చేయాలి.
వ్యాక్సిన్ సెంటర్ల పేర్లు, అడ్రస్ ల నుంచి ఏదైనా సెంటర్ను ఎంచుకోవాలి. ఆ సెంటర్లో ఏయే రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో చూపిస్తుంది.
అందులో డేట్, టైం సెలక్ట్ చేసుకుని సబ్మిట్ నొక్కాలి. మొబైల్ నంబర్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు.
2022 జనవరి 1 నాటికి 60 ఏండ్లు నిండే వాళ్లంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం 59 ఏళ్లు ఉన్నవారు కూడా అర్హులే.
సెకండ్ ఫేజ్లో 60 లక్షల మందికి
జూన్ నాటికివ్యాక్సినేషన్ పూర్తి చేస్తం
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ ఫేజ్ కోసం పూర్తి రెడీగా ఉన్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తొలి రోజు 93 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభించి, తర్వాత సెంటర్ల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డితో కలిసి శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సుమారు 1,200 ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వృద్దులు, 45 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసుండి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవాళ్లు కలిపి.. 55 లక్షల నుంచి 60 లక్షల మంది ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు. జూన్ నాటికి సెకండ్ ఫేజ్ పూర్తి చేస్తామని చెప్పారు. ధనికులకైనా, పేదలకైనా ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉచితంగా అందజేస్తామన్నారు.
భయం వద్దు: రమేశ్రెడ్డి
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీఎంఈ రమేశ్రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, ఇందులో ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు. తాను కూడా వ్యాక్సిన్ వేసుకున్నానని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో వృద్దుల కోసం వీల్ చైర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రియాక్షన్స్ వస్తే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు రెడీగా ఉంటారని చెప్పారు.