ముంబై మురికి వాడల్లో 57 శాతం కరోనా

ముంబై మురికి వాడల్లో 57 శాతం కరోనా

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముంబైలో 57 శాతం మురికివాడల్లో నివసించే ప్రజలు కరోనా బారినపడినట్లు సీరోలాజికల్ సర్వైలెన్స్ అధ్యయనం తెలిపింది. నగరంలో నివాసం ఉంటున్న 7 వేల మంది నమూనాలను సేకరించిన అధ్యయన బృందం, వారి రక్తంలోని యాంటీ బాడీలపై పరీక్షలు జరిపి ఈ వాస్తవాన్ని ప్రకటించింది. వీరిలో అత్యధికులు తమ శరీరంలోని యాంటీ బాడీల సాయంతో కరోనా లక్షణాలు బయట పడకుండా చేసుకున్నారని, గతంలో పలు రకాల వైరస్ ల బారిన పడివుండటం చాలా మందికి ఇప్పుడు ప్లస్ పాయింట్ గా మారిందని పరిశోధకులు చెప్పారు.

గతంలో వైరస్ బారిన పడిన వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, అవి ఇప్పుడు కరోనాను ఎదుర్కొంటున్నాయని తమ పరిశోధనలో తేలినట్లు సీరోలాజికల్ సర్వైలెన్స్ చెప్పింది. ముంబైలో కరోనా కేసులు లక్ష మార్క్ ను దాటింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నగరంలో సుమారు1.20 కోట్ల మంది నివాసం ఉంటుండగా, వీరిలో 65 శాతం మంది మురికి వాడల్లోనే ఉంటున్నారు.

నీతి ఆయోగ్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తమవంతు సహకారాన్ని అందించాయి. మూడు మునిసిపల్ వార్డుల్లో పర్యటించిన ఆరోగ్య కార్యకర్తలు శాంపిల్స్ సేకరించారు. కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఉన్నాయని కూడా అధ్యయనంలో తేలింది. ఈ సర్వేను జూలై 12 నుంచి 14 వరకు నిర్వహించినట్లు తెలిపారు.