మధ్యప్రదేశ్ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన డాక్టర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక వారిపై దాడికి తెగబడ్డ ఘటన గురువారం మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపగా.. దాడి చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వైరస్ రోగులతో సన్నిహితంగా మెదిలిన వారిని పరీక్షించేందుకు వైద్య బందాలు ఇండోర్ లోని తటపట్టి బఖల్ ప్రాంతానికి చేరుకున్నాయి. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు డాక్టర్లను కించపరుస్తూ మాట్లాడటమే కాక.. వారిపై ఉమ్మివేస్తూ రాళ్లదాడి చేశారు.
దీంతో వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ దాడిలో మహిళా డాక్టర్లకు గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి స్థానికులు బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో మెహరించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.