కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మంత్రులు పలు సలహాలు ఇచ్చారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు వివరించారాయన. పార్లమెంటు సభ్యుల జీతాలు, పెన్షన్ల చట్టం-1954ను సవరిస్తామని చెప్పారు. అలాగే ఎంపీ లాడ్స్ నిధులను (రూ.7900 కోట్లు) రెండేళ్ల పాటు నిలిపేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మొత్తం సొమ్మును కన్సాలిడేటెడ్ ఫండ్ కు బదిలీ చేయనున్నామన్నారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి జీతాల్లో కూడా 30 కోత విధించనున్నామని తెలిపారు ప్రకాశ్ జవదేకర్. దీనిపై వారిద్దరూ స్వచ్ఛందంగా లేఖలు పంపారని చెప్పారు. అలాగే అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా ఏడాది పాటు తమ జీతాల్లో 30 శాతం కోతకు అంగీకరిస్తూ లెటర్లు పంపారన్నారు.
