సీసీఐ పై విసుగెత్తి.. ‘ప్రైవేటు’కు పత్తి రైతు!

 సీసీఐ పై విసుగెత్తి.. ‘ప్రైవేటు’కు పత్తి రైతు!
  • స్లాట్  బుకింగ్ లో ఇబ్బందులు
  • ఆలస్యమవుతున్న కొనుగోళ్లు
  • పత్తి ఏరిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న కూలీలు
  • నష్టం వచ్చినా వ్యాపారులకే అమ్ముతున్న రైతులు

మహబూబ్​నగర్, వెలుగు: ఈ సీజన్​లో పత్తి సాగు చేసిన రైతులకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది. సీసీఐ సెంటర్లను ఓపెన్​ చేసినా.. ఆన్​లైన్​ విధానం తీసుకురావడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. పత్తి కొనుగోళ్ల కోసం స్లాట్​ బుక్కింగ్​లు చేసుకోవాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో బుక్కింగ్​లు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు సీసీఐలో తరచూ రూల్స్​ మారుతుండడంతో అక్కడ పంటను అమ్ముకోలేక రైతులు విసుగెత్తిపోతున్నారు.

 పత్తి ఏరి చాలా రోజులు అవుతుండడంతో డబ్బుల కోసం కూలీలు, పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చిన ప్రైవేట్​ ఫైనాన్షియర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక తక్కువ ధరకే ప్రైవేట్​లో పంటను అమ్ముకొని నష్టపోతున్నారు.

50 రోజుల కిందటే దిగుబడులు ప్రారంభం..

వానాకాలంలో సాగు చేసిన పత్తి దిగుబడి 50 రోజుల కిందటే ప్రారంభం కాగా.. అక్టోబర్​ మొదటి వారం నుంచి పత్తి ఏరడం ప్రారంభమైంది. కానీ, పత్తి ఎక్కువగా సాగు కావడంతో కూలీల కొరత ఏర్పడింది. కూలీలు అందుబాటులో లేక కూలీ రేట్లు పెంచారు. గతేడాది ఒకరికి రూ.350‌‌‌‌ కూలీ ‌‌‌‌ఉండగా.. ఈ సీజన్​లో రూ.500 వరకు పెరిగింది. ఆ రేటుకు రైతులు కూలీలను పెట్టి పత్తిని తీయించారు. సీసీఐ సెంటర్లలో అమ్ముకుంటే మద్దతు ధర వస్తుందని, ఆ డబ్బులో కొంత మొత్తాన్ని కూలీలకు చెల్లిస్తే సరిపోతుందని భావించారు. 

కానీ, పరిస్థితులు తలకిందులయ్యాయి. యాప్​ ద్వారా స్లాట్​ బుక్​ చేసుకొని సీసీఐ సెంటర్లలో పత్తి అమ్ముకోవాల్సి రావడంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. యాప్​లో చాలా మందికి స్లాట్లు బుక్కింగ్​ కాక ఇబ్బందులు ఏర్పడితే.. స్లాట్​ బుక్  చేసుకున్న వారి వివరాలు ఆన్​లైన్​లో లేకపోవడంతో రైతులను వెనక్కి పంపిస్తున్నారు. ఇదే సమయంలో పత్తి ఏరిన డబ్బుల కోసం కూలీలు రైతుల ఇండ్లకు వస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప్రైవేట్​ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు మాయిశ్చర్ 12 శాతంలోపు ఉన్నా.. క్వింటాల్ కు రూ.6,800 నుంచి రూ.7,100 ధర కట్టి నిండా ముంచుతున్నారు. మరికొందరు రైతులు ఆలస్యమైనా సీసీఐ సెంటర్లలో పత్తిని అమ్ముకోవాలని.. కూలీల డబ్బులు చెల్లించేందుకు ప్రైవేట్​ ఫైనాన్స్​లను ఆశ్రయిస్తున్నారు. 3 నుంచి 5 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి కూలీలకు చెల్లిస్తున్నారు. మరోవైపు పత్తిని ఇండ్లల్లో నిల్వ చేసుకున్న రైతులు ఆందోళకు గురవుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి నల్లగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.

కండీషన్లతో స్లాట్​ బుకింగ్​లకు దూరం..

సీసీఐ సెంటర్లలో పత్తిని అమ్ముకోవడానికి ‘కపాస్​ కిసాన్’ యాప్​ను తీసుకొచ్చారు. ఈ యాప్​ ద్వారా రైతు స్లాట్​ బుక్​ చేసుకుంటే, ఆ రైతు పత్తిని సీసీఐ సెంటర్లలో కొంటారు. సెంటర్లు తెరిచిన మొదట్లో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనాలని కండీషన్​ ఉండేది. ఆ సమయంలో సాంకేతిక సమస్యలతో స్లాట్​లు రిజెక్ట్​ అయ్యాయి. ఆన్​లైన్​లో రైతుల వివరాలు తప్పుగా నమోదు చేసినా కాన్సిల్​  అయ్యేవి. అయితే గత సోమవారం నుంచి సీసీఐ ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులుగా 7 క్వింటాళ్లనే కొనాలని కండీషన్​ తీసుకొచ్చింది. 

ఈ కండీషన్​ అమలైనప్పటి నుంచి స్లాట్​ బుకింగ్​లో ఇబ్బందులు రావడం లేదు. కానీ, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనాలనే కండీషన్​తో రైతులు స్లాట్​ బుకింగ్​ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. కర్నాటక, స్థానిక వ్యాపారులకు పత్తిని అమ్ముకుంటున్నారు. మరికొందరు సీసీఐ కండీషన్​ను మారుస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.

ప్రైవేట్​లో అమ్ముకున్నా..

నాకున్న ఎకరా భూమితో పాటు మరో  రెండు ఎకరాలకు కౌలుకు తీసుకొని పత్తి ఏసిన. సీసీఐ సెంటర్​లో పత్తిని అమ్మడానికి స్లాట్​కు బుక్​ చేసిన. ఎకరాకు 12 క్వింటాళ్లు కొంటున్నట్లు స్లాట్​ బుక్​ అయింది. పత్తిని సెంటర్ కు తీసుకెళ్లాక​ఏడు క్వింటాళ్లే కొంటామని చెప్పిండ్రు. చేసేది లేక క్వింటాల్​కు రూ.7 వేల చొప్పున ప్రైవేట్​ వ్యాపారికి అమ్మిన.
–చంద్రపోళ్ల మల్లప్ప, ఊట్కూరు

ఎకరాకు 7 క్వింటాళ్లు కొంటే ఎట్ల?

నాకున్న మూడు ఎకరాల్లో పత్తి ఏసిన. 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను అమ్ముదామంటే ఆన్​లైన్​లో బుకింగ్​ కాలేదు. పాలమూరు సీసీఐ సెంటర్ కు పోతే ఎకరాకు ఏడు క్వింటాళ్లే తీసుకుంటామని చెబుతున్నరు. చేసేది లేక ప్రైవేట్​ వ్యాపారికి పత్తిని అమ్మిన. క్వింటాల్​కు రూ.6,750 చొప్పున చెల్లించడంతో నష్టపోయిన. - నవీన్, అమ్మాపూర్