
మెదక్ (చేగుంట), వెలుగు: లాక్డౌన్ వల్ల పని పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆ టైమ్లో కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. వీటన్నింటితో మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల మృతితో ఇద్దరు కొడుకులు అనాథలయ్యారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లికి చెందిన మంగలి కిషోర్ (42), కవిత (38) దంపతులు బతుకుదెరువుకోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిలకలగూడలో నివాసమున్నారు. కిషోర్ ఓ షాప్ను కిరాయికి తీసుకుని బార్బర్ షాప్ నడిపించేవాడు. కరోనా లాక్డౌన్ వల్ల గతేడాది, ఈసారి చాలా రోజులు షాప్ బంద్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇళ్లు గడవడం కష్టమైంది. ఉపాధి లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కిషోర్ 4 రోజుల కిందట భార్యా పిల్లలతో సొంతూరు పోతాన్పల్లికి వచ్చాడు. బుధవారం మళ్లీ హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకుని కొడుకులిద్దరినీ తాత మల్లేశ్తో బస్లో పంపాడు. కిషోర్, కవిత బైక్పై బయలు దేరారు. దారిలో తూప్రాన్లో ఆగి ఫర్టిలైజర్ షాప్లో గడ్డి మందు కొనుక్కొని వెనక్కి వచ్చారు. మాసాయిపేట బంగారమ్మ గుడి దగ్గరకు చేరుకుని భార్యాభర్తలిద్దరూ గడ్డి మందు తాగారు. కడుపులో మండటంతో భరించలేక బైక్పై తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన కుటుంబీకులు పరిస్థితి సీరియస్గా ఉండటంతో కవితను కొంపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిషోర్ గురువారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో కొడుకులు స్నేహిత్(14), ప్రణీత్(12) అనాథలయ్యారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్తాపంతో కిషోర్, కవిత సూసైడ్ చేసుకున్నారని కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, పోతాన్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.