
- వాటికి ఆ అధికారం లేదు
- ఏజీ విచారణ 22కు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఉత్తర్వులు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కూనం వివేకానంద గౌడ్.. దానం నాగేందర్పై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
వాటిని గురువారం జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి విచారించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, స్పీకర్కు కోర్టు ఉత్తర్వుల జారీకి ఆస్కారమే లేదన్నారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్కు కోర్టులు గడువు నిర్ణయించలేవన్నారు. స్పీకర్కు పిటిషన్లు ఇచ్చిన వెంటనే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని తప్పుపట్టారు. ఇదేమీ హడావుడిగా చేయాల్సిన వ్యవహారం కాదని, ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
స్పీకర్కు గడువు ఇచ్చే పరిధి హైకోర్టుకు లేదని ‘‘కి హోటో హోలో హన్’’ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. పిటిషనర్లు కేశం మెగా చంద్రసింగ్ కేసులో ముగ్గురు జడ్జిలు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని ఉత్తర్వులు కోరుతున్నారని, అప్పటికే సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం స్పీకర్కు కోర్టులు ఆదేశాలు, గడువు నిర్ణయించలేవని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
గతంలో తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్పై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని, దానిపై నిర్ణయం తీసుకుని అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఎరబ్రెల్లి దయాకర్రావు దాఖలు చేసిన పిటిషన్ను ఇదే హైకోర్టు తోసిపుచ్చిందని గుర్తుచేశారు. హిమాచల్ప్రదేశ్ హైకోర్టు కూడా స్పీకర్కు ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం లేదని చెప్పిందన్నారు.
ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్రావు, జె.రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ఇదే విధానం కొనసాగుతుందని చెప్పారు. దీనిపై హైకోర్టు, పిటిషన్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీ/ఆఫీసులను కోరుతున్నామని, తమ ముందున్న వ్యాజ్యాలను విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వడమే తమ ముందున్న అంశమని వ్యాఖ్యానించింది. విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.